Monday, October 24, 2011

మన దీపావళి

  
     మనిషన్నాక కూసింత కళా పోషనుండాలి. కళాపోషణ మాట దేవుడెరుగు. అసలు మనం ఎన్నో చిన్న చిన్న ఆనందాలకి, ఉత్సాహాలకి దూరమైపోతున్నాం. కాదు దూరం చేసుకుంటున్నాం. కాదనగలమా.... ఇందుకు ఓ పెద్ద ఉదాహరణే దీపావళి సంబరం. ఎంతో ఉత్సాహన్ని అందించే ఈ మతాబుల మహోత్సవంలో మనసారా పాల్గొంటున్నామా..... కారణాలు ఏవైనా కావొచ్చు. కేవలం టీవీలకీ, కంప్యూటర్లకి పరిమితమైపోతూ ఏదో  అయిపోయిందిలే అనుకునే దీపావళిలో కిక్కికేముంది. అసలు మజా రావాలంటే... బాల్యంలో మనం చేసిన హంగామాను ఓ సారి గుర్తు చేసుకోవాల్సిందే....

      ఒక్కసారిగా చిన్నతనాన్ని గుర్తు చేసుకుంటే చాలు. బోలెడంత ఉత్సాహం ఉరకలేస్తు.... లెక్కలేనంత శక్తిని అందిస్తుంది.పండగ మరో పదిహేను రోజులు ఉందనగానే ప్రతి వాళ్ల ఇళ్లల్లో హంగామా మొదలు. చిన్న చిన్న తుపాకులతో... పటాసుల చప్పుళ్లతో అదరగొట్టే క్షణాల్ని ఎలా మరచిపోగలం. తిన్నామా లేదా బడికి వెళ్లామా లేదా ఏమీ పట్టేదే  కాదు కదా... ఇరుగు పొరుగు ఫ్రెండ్స్ కంటే ఎక్కువ టపాసులు కొన్నామా లేదా అనేదే ధ్యాస. టపాసులెప్పుడు కొంటాం అంటూ అమ్మ చెవిలో జోరిగలా చేసిన మారాంతోనే దీపావళి సందడి ఆరంభం.  నాన్నతో పాటు బజారుకెళ్లి సంచి నిండా కొని తెచ్చుకున్న టపాసుల్ని చూసుకుంటూ మురిసిపోయిన క్షణాలు మన గుండెల్లో మతాబుల వెలుగుల్లా ఎప్పటికీ భద్రంగా నిలిచే ఉంటాయి. అసలు కథ ఇక్కడే కదా మొదలయ్యేది. ఎంతో ఇష్టంగా తెచ్చుకున్న టపాసుల్ని ఎండలో ఎంచక్కా ఆరబెట్టుకుంటూ.... వాటి చుట్టూ భూచక్రాల్లా తిరుగుతూ కాపలా కాసిన క్షణాల్ని తలచుకుంటే ఒక్కసారిగా మనం చిన్నపిల్లలుగా మారిపోకుండా ఉండగలమా.... 




       దీపావళికి యూత్ చేసే హంగామానే అసలు సిసలు మజా. తారాలు, సిసింద్రీలు తయారీలో వాళ్లు పడే హైరానా.... వాటి తయారి కోసం సిద్ధం చేసే సరంజామా... వావ్ ఆ అనుభవాలు ప్రతి ఒక్కరి మనసుల్లో శాశ్వతానందాల్ని అందిస్తూ ఉండవా.... ఎంతో ఇష్టంగా తయారు చేసిన మందుగుండు సామాగ్రిని కాల్చుతూ... ఆ వెలుగుల్ని చూస్తూ విజయానందంతో భుజాలెగరేసిన క్షణాలే కదా అసలైన దీపావళి. దీపావళి రోజున జరిగే తారా జువ్వల పోటీలు, తర్వాత వచ్చే గొడవలు అందించిన అనుభవాల్ని తలుచుకుంటే, వావ్ అనకుండా ఉండగలమా.... అంతటి ఆనందాలకు కారణం మనతో పాటు మన తల్లితండ్రులు అందించిన అనురాగం ప్రోతాహాలే కారణం. ఆదాయాలతో సంబంధం లేకుండా అందరం కలసి ఆనందంగా ఉండాలనేదే ప్రధాన సూత్రంగా ఉండేవి కాబట్టే మన బాల్యంలో జరిగిపిన దీపావళి వేడుకలు అంత మధురం. 


           పండగ అంటేనే అందరి కలయిక. సంతోషాల సమ్మేళనం. ఓ ఆత్మీయ వేడుక. అన్ని పండగల్లోనూ దీపావళి ప్రత్యేకం. వయోభేదాలు మరచి ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఈ పండగ ప్రతి ఒక్కరి జీవితాల్లోనూ ఓ గొప్ప అనుభూతుల్ని నింపుతుంది. రానురాను కాంతులున్నా.... కళ తగ్గిపోతుందనే వాళ్లే ఎక్కువ అవుతున్నారు. ఇందులోనూ కాస్త నిజం లేకపోలేదు. మనిషి నిత్యం ఆశావాదిగానే ఉంటాడు. ఉండాలి.అందుకే కళ తగ్గిపోతుందనుకుంటున్న మన దివ్వెల పండగని... దేదీప్యమానం చేద్దాం. సరదాగా దీపావళిని ఆనందోత్సాహలతో.... సంబరంగా జరుపుకుందాం. కాకరపువ్వులు, వెన్నముద్దలు, భూచక్రాలు, చిచ్చుబుడ్డులు, తారా జువ్వల్ని ఈ సారి మనం కూడా కాలుద్దాం. దీపావళి వేడుకలో అసలైన మజాని ఆస్వాదిస్తూ దీపావళి ఆనందాల్ని భావితరాలకు అందిద్దాం.  

Wednesday, September 28, 2011

ఆత్మీయ ఆహ్వానం...


        ప్రేమలో విజయం సాధించి, పవిత్ర ప్రేమని.. శాశ్వత వివాహ బంధంగా మార్చుకోవాలని కోరుకునే  ఓ ప్రేమికుడి మనసు పలికిన మౌనరాగాలు..  
       ఆమె ఫోన్ చెయ్యకపోతే ఎందుకంత బాధ.. ఆమె నుంచి మెసేజ్ రాకపోతే ఎందుకంత ఆవేదన... ఏం ప్రాణం పోతుందా.. ఉద్యోగమేమైనా ఊడిపోతుందా.... లేక భూ ప్రళయం వస్తుందా... ఎందుకంత ఆవేదన.. ఎందుకంత బాధ.. ఇలా ప్రతిసారి నా మనసుకు చెప్పుకోవాలని, నా మనసు పడుతున్న ఆరాటాన్ని తగ్గించుకోవాలని అనిపిస్తుంది. కానీ, నా వళ్ల కావడం లేదు. ఎందుకిలా అవుతుంది. ప్రతి క్షణం ఆమె రూపం నా మదిలో మెదులాడుతునే ఉంది. ఆమె ఆలోచనే నా దినచర్యగా మారిపోయింది. ఎందుకిలా అవుతోంది. ఈ క్షణంలో తను బహుశా ఇలా ఉండొచ్చు. ఆ సమయంలో ఆమె అలా మాట్లాడొచ్చు. ఇలా అనుక్షణం ఆమె గురించి ఆలోచనలే. అంతేనా, తను నాతోనే ఉండాలి. తను నా ఆలోచనగా బతకాలి... నీకు సన్నిహితంగా ఉండే వాళ్లపై ఈర్ష్య పడేలా చేస్తున్నావ్.స్నేహమంటే ప్రాణమిచ్చే నాలోనూ కనిపించని కసిని నింపుతున్నావు. ఎందుకింతలా ఎప్పుడు లేని స్వార్ధం కలుగుతుందోంది. మనసు ఆవేదన చెందుతుంది. 
ఇలా ఎన్నో ప్రశ్నలు పిచ్చెక్కిస్తున్నాయి. కానీ, ఒకటి మాత్రం నిజం... ఇంతలా నీగురించి ఆలోచిస్తున్నా... ఏదో మూల మన జ్ఞాపకాల్లో తియ్యని అనుభూతి ఎంతటి బాధనైనా తట్టుకునే శక్తిని అందిస్తుంది.
    నువ్వు ఎన్ని గంటలకు లేస్తావో... ఎన్నింటికి రెడీ అవుతావో... ఏ రోజు ఎలాంటి డ్రస్ వేసుకుంటావో.. ఒకటేమిటి... ఒక్కమాటలో చెప్పాలంటే నాతో నేను ఉంటునే, పూర్తిగా నీవయ్యాయను. నిన్ను సొంతం చేసుకోవాలనే తపనలో...  మిత్రులకి సమయం కేటాయించలేక, మాట్లడక... నా సొంత వాళ్లకు దూరమవుతున్నానేమోనని ఆవేదన కలుగుతుందుంది. అయినా నవ్వు కావాలని... నువ్వే కావాలని..నీతో బతుకు పంచుకోవాలని మనసు పదే పదే చెబుతుంది. కావాల్సినంత ప్రోత్సాహాన్ని అందిస్తుంది.  అందుకే ఏ మెసేజ్ వచ్చినా. ఎక్కడ నుంచి కాల్ వచ్చినా అది నీ ఆత్మీయ తలపేనేమో అని ఉలిక్కి పడడం పరిపాటిగా మారిపోయింది. చూసేవాళ్లకు ఏంటీ ఈ ధోరణి... ఎందుకింత పిచ్చి... అనిపించొచ్చు. నిజమే ఇది పిచ్చే... కానీ పాపం... నిజాయితితో ప్రేమిస్తూ పరితపిస్తున్న మనసుకు తెలియదు కదా... ఇది పిచ్చని.  

   నా ప్రేమలో స్వచ్ఛత, నా మాటల్లో నిజాయితీ నీకు మాత్రం తెలియనిదా... నిన్ను మెప్పించినవి... నీ ప్రేమను దక్కించినవి నా ఈ లక్షణాలే కదా. మనం కలిసిన ప్రతి సందర్భం, మాట్లాడుకున్న ప్రతి మాట... మదిలో శాశ్వత ఆనందాన్ని అందిస్తున్నాయి. ప్రతి క్షణం నీ ఆనందాన్ని, అభివృద్ధిని  మనసారా కోరుకుంటున్నాను. అంతేకాదు, నీ ఆనందం నేనే అవ్వాలనీ, నీ ఆనందం నీనే అయితే ఎంత బాగుంటుందో అని ఆశ పడుతున్నాను. ఎన్ని కన్నీళ్లెదురైనా, ఎన్ని కష్టాలు కాళ్లకు బంధాల్ని వేసినా.. నీ దరిచేరాలనీ, నిన్ను దక్కించుకోవాలనీ... నీ.. ప్రేమ గురుతులతో నింపిన నా మనసు రెట్టించిన ఉత్సాహంతో ఉరకలు వేస్తోంది. మనసులు కలయికతో మధుర లోకాల్లో విహరిస్తున్న మన బంధాన్ని... ప్రణయ బంధంగా మార్చేందుకు శ్రీకారం చుట్టు. నీ మనసు విప్పు... నా మదిలో రగులుతున్న నిప్పును ఆర్పు. 

Friday, August 12, 2011

చెల్లాయి కోరిక...




         ఒకటే టెన్షన్. చేస్తున్న పనిమీద ద్యాస నిలవడం లేదు.మనసు ఆధీనంలో ఉండడం లేదు. గుండెల్లో గుబులు. తను కోరుకున్నది నేరవేరుతుందో లేదో... ఆ మధుర క్షణం వస్తుందో రాదో. ఇది ఓ చిట్టి చెల్లెలి గుండె గోస. బతుకు పోరులో సుదూరంగా ఉన్న... అన్న... రాఖీ పండగ రోజు వస్తాడో రాడో అని ఓ చిట్టి చెల్లెలు పడే మానసిక ఆవేదన. ఊహ తెలిసినప్పటి నుంచి రాఖీ రోజున అన్న చేతికి రాఖీ కట్టి.. అమ్మ చేసిన పాయసం తాగించే ఆ చిట్టి చేతులు ఈ సారి.... అన్న కోసం ఆత్మీయంగా ఎదురుచూస్తున్నాయి.  
     రక్త సంబంధంలోని మమకారం. సుదూరంగా ఉన్న అన్నను తన మదిలో కనిపించేలా చేస్తున్నాయి. ఆ అన్న కోసం చెల్లె మనసులో ఆవేదన.. కళ్లలో నీటి తెరల్ని నింపుతోంది. చిన్న నాటి నుంచి కలసి మెలసి కొట్టుకుంటూ, తిట్టుకుంటూ గడిపిన క్షణాలు తన మనసులో మెదులు తున్నాయి. ఆ జ్ఞాపకాలు పెదవులపై చిరునవ్వుగా దర్శనమిస్తున్నాయి.. చిన్న తనంలో అన్నపై చాడీలు చెప్పిన క్షణాల నుంచి అన్న కంటే నేనే గొప్ప అంటూ నాన్నతో పోట్లాడే దృశ్యాలు కదలాడుతున్నాయి.    
               నాన్న కంటపడకుండా క్రికెట్ మ్యాచ్ కి వెళ్లొచ్చిన అన్నకు గుట్టుచప్పుడు లేకుండా అన్నంపెట్టిన రోజుని ఆ చెల్లలు తలుచుకుంటోంది.  ఎవరికంటా పడకుండా సిగిరెట్ కాల్చిన అన్నకు బ్లాక్ మెయిల్ చేసిన దృశ్యం నవ్వుతెప్పిస్తోంది. అన్న ఫ్రెండ్స్ ని ఆటపట్టించిన సందర్భాలు మదిలో మెదులుతున్నాయి.  
         
           చిన్నతనంలో రాఖీ కట్టినప్పుడు... చెల్లాయికి డబ్బులివ్వరా అంటూ నాన్న జోబులోంచి తీసిచ్చిన నోటు తను మరోసారి గుర్తుకుతెచ్చుకుంటోంది. మునుపటి ఏడాది అన్న బహుమతిగా కొనిచ్చిన బంగారు గొలుసుని నిమురుతూ... సుదూరంగా ఉండే అన్న ఈ పండగరోజు వచ్చే అవకాశం లేదని తెలిసినా.... వస్తే బాగుండూ  అనుకుంటున్న ఆ తోబుట్టువు... అన్న వచ్చినా.. రాకున్నా ఎక్కడున్నా... హాయిగా ఉండాలని... దినదినాభివృద్ధి చెందాలని... అనుకున్న లక్ష్యాలను అందుకోవాలని మనసారా కోరుకుంటోంది. 

        మిత్రులందరికీ రాఖీ దినోత్సవ శుభాకాంక్షలు.


Saturday, August 6, 2011

స్నేహమేరా శాశ్వతం....


   
       స్నేహం. ఈ చిన్న పదంలోనే ఏదో తెలియని మధురానుభూతి దాగుంది.  మనసారా వీడు నా స్నేహితుడు అని గర్వంగా చెప్పుకోవడంలో ఏదో తెలియని ధర్పం కనిపిస్తుంది. రక్త సంబంధాలేవీ లేకుండా స్నేహమనే ఓ తియ్యని, సుతిమెత్తని కమ్మనైన బంధంతో మనసుల్ని మేళవింపు చేస్తుంది. మనుషులు వేరైనా...మనసులొక్కటిగా బతికే అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది  స్నేహం. కులమతాలు, వేషభాషలు, ప్రాంతీయ బేధాలకు అతీతంగా అంకురించే సౌరభమే స్నేహం.  ఎప్పుడు ఎక్కడ ఎలా ఆవిర్భవిస్తుందో చెప్పడం కష్టం. కానీ ఒక్కసారి స్నేహితులమైయ్యాక... ఆ కలయిక కడదాకా, చివరి స్వాశ వరకూ కొనసాగుతుంది. అంత పవిత్రమైనది ఈ బంధం. 

            అమ్మలా లాలిస్తూ, నాన్నలా దండిస్తూ, అన్నలా దిశానిర్దేశం చేసే వాడే నిజమైన స్నహితుడు. కష్ట సుఖాల్లో నీడలా తోడుండే మిత్రుడు...నేనున్నానంటూ ఇచ్చే భరోసా... విజయం సాధించినప్పుడు మనసారా చిందించే చిరునవ్వు, ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు భుజం తట్టి అందించే భరోసా మనసు మెచ్చిన మిత్రుడికే సాధ్యం. 


              ఆటల్లో, పాటల్లో, నడతలో, నడకలో ఒక్కటిగా జీవిస్తూ... మనలో మంచిని, చెడుని గమనిస్తూ... అవసరమైనప్పుడు మందలిస్తూ మలగడం మనసెరిగిన మిత్రుడికే సాధ్యం. జీవితాంతం వాడు నా మిత్రుడు అని గర్వంగా చెప్పుకుంటూ ఉంటే ఆహా ఆ అనుభూతి మాటల్లో వర్ణించగలమా... 


               సృష్టిని నడిపిస్తున్నది స్నేహమంటే తప్పుకాదేమో అనిపిస్తోంది.   మనసుని తెలుసుకుని, లాభాపేక్ష లేకుండా మన ఎదుగుదలని మనసారా ఆకాంక్షించే వ్యక్తిత్వం మిత్రునికే సొంతం. స్నేహంలోని మాధుర్యాన్ని పంచడం కోసం ఓ రోజు ప్రత్యేకంగా కావాలా...? అనుక్షణం ప్రతి క్షణం... ప్రతి ఒక్కరినీ నడిపించేది... ఆత్మీయతతో ఆసరాగా నిలిచేదీ స్నేహమే. అందుకే మంచి స్నేహితులున్న ప్రతి ఒక్కరూ అదృష్టవంతులే. పవిత్రమైన స్నేహం పదికాలాల పాటు పరిమళించాలని, ప్రతి ఒక్కరికీ స్నేహ సౌరభాలు దక్కాలని కోరుకుంటున్నాను.  

Friday, July 29, 2011

దేవుడు వరమిస్తే...


     
       దేవుడు వరమిస్తే... ఏం కోరుకుంటావు అని అడిగితే నా దగ్గర చాలా పెద్ద లిస్టే ఉంది. ముందుగా నా చిన్నతనాన్ని కావాలని కోరుకుంటాను. అమ్మ చేయి పట్టుకుంటూ స్కూలుకెళ్లిన రోజుని మరోసారి కావాలంటాను. అమ్మ, నాన్న ఆత్మీయతల మధ్య గడిపిన క్షణాల్ని ఇమ్మంటాను. పసితనంలో సావాసగాళ్లతో ఆడిన ఆటల్ని మళ్లీ ఆడాలనుకుంటాను. నునూగు మీసాల వయస్సులో నేస్తాలతో చేసిన అల్లరి మరోసారి చేసే అవకాశాన్ని ఇమ్మంటాను. 
         జేబులో చిల్లిగవ్వ లేకున్నా, బిల్గేట్స్ కంటే హ్యాపీగా గడిపేస్తూ... కొత్తగా చిగురేస్తున్న ఊహల్లో ఊగిపోతూ... హాయిగా తేలిపోతూ ప్రపంచంలో అన్ని విషయాల్ని చర్చించే కాలేజీ రోజుల్ని ఒక్కసారి చుట్టొచ్చే అవకాశం కలిగించమంటాను. అమ్మాయిల్ని ఆటపట్టిద్దామనుకునే రోజుల్లో కరవైన ధైర్యాన్ని... మరోసారి ఆ సందర్భాల్లో ప్రదర్శించే వీలు కల్పించమంటాను.  


         పచ్చని పొలాలతో పరికిణి కట్టిన పడుచులా మెరిసిపోయే పల్లె అందాలు ఎప్పటికీ అలానే ఉండాలని కోరుకుంటాను. సాటి మనిషిని ఆపదలో ఆదుకునే మానవత్వాన్ని అందరిలో కలకాలం పెంపొందేలా చూడమని ప్రార్ధిస్తాను. ఆనందమైన జీవితాన్ని.. ఆరోగ్యంగా గడిపే వీలు అందరికీ కలిగించాలని అడుగుతాను. చెరగని, తరగని చిరనవ్వుల జీవితాల్ని సృష్టించుకునే అవకాశాల్ని చూపించమంటాను. అందరితో పాటు నేను కూడా చాలా బాగుండాలని ప్రార్దిస్తాను. ఇక చాలు ఇంతకంటే ఎక్కువ అడిగితే దేవుడు ఫీలౌతాడేమో కదా.... పర్వాలేదు... దేవుడు ఫీలవ్వడు..... ఎందుకంటే.... బేసికల్ గా అతడు దేవుడు కదా......ఇదంతా ఓకే గానీ పొరపాటున మీకు దేవుడు వరమిస్తే తప్పకుండా... నా కోరికలు నెరవేరాలని కోరుకోండీ... ప్లీజ్... 

Friday, July 15, 2011

నాకు నచ్చిన మూవీ నాన్న...



         అయిదు ఫైట్లు... నాలుగు పాటలు.. ఒక ఐటెం సాంగ్ ను కావాలనుకునే వాళ్లు నాన్న సినిమాని చూడొద్దు. ఎందుకంటే నాన్న మూవీలో ఈ ఎలిమెంట్స్ ఏవీ ఉండవు. అయినా ఈ సినిమా నాకు చాలా నచ్చింది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మానవత్వపు విలువల్ని స్పృశిస్తూ తీసిన స్వచ్ఛమైన కుటుంబ కథాచిత్రం విక్రమ్ నటించిన నాన్న సినిమా. ఈరోజు మీడియా కోసం వేసిన స్పెషల్ షోను చూశాను. చలించిపోయాను. నాన్న ప్రేమలో ఉండే మాధుర్యాన్ని చాటిచెప్పేలా అద్భుతంగా సినిమాను తెరకెక్కించారు. విక్రమ్ నటన సినిమాని ఓ రేంజ్ కి తీసుకెళ్తుంది. మానసికంగా ఎదగని ఓ వ్యక్తి పాత్రలో విక్రమ్ జీవించాడు. మానసికంగా ఎదగని తండ్రికి కూతురుగా ఉండాలో లేక అమ్మగా లాలించాలో తెలియని అయిదేళ్ల పాప పాత్రలో బాలనటి సారా అద్భుతంగా నటించింది. కొన్ని సన్నివేశాల్లో తన హావభావాలతో ప్రేక్షకులు అవాక్కయ్యేలా చేసింది. అనుష్క, అమలాపాల్ మిగతా పాత్రలు కథని రక్తికట్టించడంలో తమ వంతు కృషి చేశారు. 
            దర్శకుడు విజయ్ సాధారణ కథని అద్భుతంగా తెరకెక్కించాడు. హృదయాన్ని హత్తుకునే సన్నివేశాలతో  కరుణరస కావ్యంగా తీర్చిదిద్దాడు. జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకుల్ని కథలో లీనం చేస్తుంది. 
             నాన్న ప్రేమను గుర్తిస్తూ రాసిన సాహిత్యం గానీ, తండ్రి ప్రేమలో మమకారాన్ని చాటిచెబుతూ తీసిన సినిమాలు గానీ అరుదుగా కనిపిస్తాయి. ఈ సనిమా తప్పకుండా వాటి సరసన నిలుస్తుంది.  పిల్లల్ని అమితంగా ప్రేమించే తండ్రులు, తండ్రిని ప్రాణంగా ఇష్టపడే పిల్లలు తప్పక చూడాల్సిన సినిమా నాన్న. ఇది నా ఫీలింగ్. 

Wednesday, July 13, 2011

మగువ మనసు

       పెళ్లీడుకొచ్చిన అమ్మాయి తన మదిలో అలజడిని ఆవిష్కరించే ప్రయత్నం... 
        అలసి ఆలస్యంగా ఇంటికొచ్చిన నాన్నతో... నాకేం తేలేదా నాన్న అంటూ అడిగిన క్షణాన నాన్న కళ్లల్లో నా చిన్ననాటి జ్ఞాపకాలు ఒక్కసారిగా కనిపించాయి. చాలా రోజుల తర్వాత నాన్నతో అంత ఆప్యాయంగా మాట్లాడిన క్షణాలు. నాన్న చూపించిన ప్రేమ... ఒక్కసారిగా నా చిన్నతనాన్ని గుర్తుకుతెచ్చాయి. పచ్చని పల్లె పొలాల మధ్య సెకిలెక్కించుకుని బడికి నాన్న తీసుకెళ్లిన క్షణాలు.. గుర్తుకొచ్చాయి. గాంభీర్యంగా అరిచే అరుపు వెనుక దాగున్న ఆవేదన, ఆరాటం కనిపించింది. ఒక్కసారిగా మనసుని మెలేసేలా ఉక్కిరిబిక్కిరి చేసింది. నాన్న ప్రేమలో మాధుర్యాన్ని తట్టుకోలేకపోయాను. ఇన్నాళ్లు నాన్న చూపించే కోపాన్ని, భయాన్ని చూసిన కళ్లతో నాపై ఉండే ప్రేమను చూసేసరికి ఆ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 

     వెక్కి వెక్కి ఏడుస్తూ స్కూళుకెళ్లనంటూ వాకిట్లో మారాం చేసే క్షణాలు కళ్ల ముందు సాక్షాత్కరించాయి. బుంగమూతి పెట్టుకుంటూ... ఇష్టమైన గౌనుని విసిరి కొట్టిన తరుణం గుర్తొచ్చింది. అప్పుడు నాన్న కొట్టిన దెబ్బలు గుర్తుకొచ్చాయి. కొట్టిన ప్రతి దెబ్బ ఓ అద్భుతంగా అనిపిస్తోంది.దండించిన రాత్రి నాన్న చేసిన సపర్యలు లీలగా కదలాడుతున్నాయి. ఆ దెబ్బల్ని మరిపించేందుకు నాన్న కొనిచ్చిన బొమ్మలు... తినిపించిన స్వీట్లు యదతలపుల్లో మెదలాడుతున్నాయి. మళ్లీ మీకు ఆ బెత్తాన్ని అందించాలని ఉంది నాన్న...
       సైకిల్ కావాలని మారం చేసిన క్షణాన్న అమ్మ వద్దని చెబుతున్నా... పట్టించుకోకుండా...సైకిల్ నేర్పించి మరీ, సైకిల్ బహుమతిగా అందించిన క్షణాలు మరచిపోలేకపోతున్నాను.ఆడపిల్లకి ఇంగ్లీష్ చదువెందుకని పోరు పెడుతున్నా నా కోసం...నా బంగరు భవిష్యత్ కోసం పట్టుపట్టి కాన్వెంట్ కి పంపించిన మీ నిర్ణయాన్ని ఎలా మరువగలను. నేను చదువుల్లో విజయాల్ని సాధించిన ప్రతిసారి ఊరివాళ్ల ముందు మీసం మెలేస్తూ నువ్వు చూపించిన ధర్పం ఒక్కసారిగా గుర్తొస్తోంది.

           అవకాశం వస్తే మీ గుండెలపై పడుకోవాలనిపిస్తోంది. చిన్ప్పుడు నువ్వు చెప్పే కథల్ని మళ్లీ వినాలనిపిస్తోంది. ఎవరికంటా పడకుండా నా కోసం దాటిపెట్టి ప్రేమతో తినిపించిన పాలకోవా మరోసారి రుచిచూడాలనిపిస్త్దోంది. నీ సెకిలెక్కి రివ్వున ఓ చక్కర్ కొట్టాలని ఉంది. ఒక్కసారిగా మనసు ఎలిమెంటరీ స్కూల్ గెట్ దగ్గరకు వెళ్లిపోతోంది.

         ఇలా నువ్వందించిన ప్రేమ గురుతుల్ని నెమరువేసుకుంటుండగా, ఇంట్లో ఎవరో ఇవన్నీ ఇంకెన్నాళ్లులే... మరికొన్నాళ్లేగా అని అంటున్న వేళ నాలో కదిలిన అలజడి నెత్తిన నీటికుండ పెట్టినట్లు... నా ప్రమేయం లేకుండానే   కళ్లల్లో నీటి తెరలు నిండిపోయాయి. ఆ క్షణాన ఓ చిరునవ్వు విసరడం తప్ప నేనేం చేయలేను కదా... నా నవ్వునే ప్రతి ఒక్కరూ చూశారు.... కానీ ఆ చిరునవ్వు వెనుక దాగున్న దుఃఖం ఎవరికి తెలుసు. నాన్న ప్రేమలో, నాన్న చూపించిన ప్రేమతో తడిసి ముద్దైన నా మనసుకి తప్ప... 

Saturday, July 9, 2011

ప్రేమను పొందాలంటే...

       ఎవరి మనసునైనా గెలవాలంటే... అణు క్షణం ప్రతి నిముషం... మన చుట్టూ తిరిగేలా చెయ్యాలంటే... ఎక్కడ ఉన్నా పక్కనే ఉన్నామనే భావనను పెంపొందించాలంటే....ఇవన్నీ జరగాలంటే.... మనమేమైనా సెలబ్రిటీలమా..లేకపోతే పాపులర్ వ్యక్తులమా...అనుకుంటాం.
ఎదుటివాళ్ల మనసు గెలవాలంటే గొప్పవ్యక్తులం కానక్కర్లేదు. చాలా సింపుల్.  మనం మనలానే ఉంటూ... ఎదుటి వాళ్ల మనసుకి గాలం వేయడం చాలా సులువు. మనం చేయాల్సిందంతా చిన్న ప్రయత్నం.... ఓ ఐడియా జీవితాన్ని మార్చేస్తుందో లేదో తెలీదు కానీ, మన ప్రవర్తనలో చూపించే చిన్న మార్పు ఆనందమైన జీవితాన్ని ప్రసాదిస్తుంది. చిన్నా పెద్దా, కులం మతం, అంతస్తుల్లో తేడాలతో పట్టింపులేకుండా...మనసారా ఎదుటివాళ్ల కంటే ముందుగా ఆప్యాయంగా పలకరిస్తే చాలు. మన స్నేహితుల లిస్టులో మరో వ్యక్తి  జోడైపోయినట్టే. 


      నేనా వాళ్లని పలకరించడమా... అవసరమైతే వాడే పలకరిస్తాడు.నేనేంటీ వాళ్లని పలకరించడమా నో ఛాన్స్  అని చాలా మంది అనుకుంటాం. పాపం ఎదుటివాళ్లు కూడా మనలాంటి వాళ్లేగా.. వాళ్లది కూడా అదే ధోరణే అని అర్ధం చేసుకోం.ఫలింతం... మాట్లాడాలని ఉన్నా మాట్డాడం.....ఎన్నెన్నో చెప్పాలనుకున్నా చెప్పలేం. చెప్పం. అహం అడ్డుపడుతుంది. ఇంకేముంది రోజూ పక్కపక్కనే ఉంటున్నా....
రోజు రోజుకీ మనకి మనమే తెలియకుండా ఏకాకులైపోతున్నాం. 
        మనలో ఉండే కాస్త ఆ అహాన్ని పక్కన పెట్టుకుంటే అంతే... మనం ఊహించని మాయేదో జరిగిపోతుంది. అబ్రకదబ్ర... క్షణాల్లో మన ముందు అందమైన లోకం ప్రత్యేక్షమైపోతుంది. అంతా ఆత్మీయులుగా కనిపిస్తారు. మన బాగోగులను గుర్తిస్తుంటారు. మన రాక కోసం ఎదురు చూస్తుంటారు.మనం లేకపోతే ఏం తోచదు అనే స్థితి కలుగుతుంది.  తక్కువ సమయంలోనే ఆత్మీయ బంధాన్ని పెనవేసుకుంటారు.


       ఈ చిన్న మార్పుకి శ్రీకారం చుడదాం. అత్మీయ లోకానికి ఆహ్వానం పలుకుందాం.  ఆ అద్భుత ప్రపంచంలో ఆనందంగా విహరిద్దాం.

Friday, June 24, 2011

నవ్వుతూ బతకాలిరా..




      నవ్వు దేవుడు మనుషులకు మాత్రమే ఇచ్చిన గొప్ప వరాల్లో అత్యుత్తమమైనది. ఆందమైన జీవితాల్ని ఆనందమయంగా మార్చుకునే ఏకైక మార్గం నవ్వు. అద్భుతమైన క్షణాల్ని మరింత ఆనందమయంగా మార్చే కిక్కు... టానిక్కు నవ్వుకే సాధ్యం. రూపును..చూపును మార్చే మహత్తర శక్తి ఈ నవ్వుకే సొంతం. మన చుట్టూ మనదైన సుందర కమనీయ వాతావరణాన్ని సృష్టించే ఏకైక ఫార్ములా మన నవ్వే. నవ్వడం ఓ యోగం... నవ్వించడం ఓ భోగం... నవ్వలేక పోవడం ఓ రోగం అన్న జంధ్యాల మాటలు అక్షర సత్యాలు. ప్రపంచ మానవాళి అందరికీ తెలిసిన ఏకైక భాషేదైనా ఉందంటే అది నవ్వే. అందుకే స్వర్గం ఎక్కడో ఉందనుకునే మనందరికీ... ఎక్కడో కాదు కావాలంటే అనుకుంటే... మనం ఎక్కడుంటే అక్కడే స్వర్గంగా మలచుకునేందుకు షార్ట్ కట్ మన దరహాసమే. 

          పసిపాపలా నవ్వడం... పరవశంగా నవ్వడం... నవ్విను పంచుతూ పెంచుతూ ఉండడం ఓ వరం... ఈ వరం పొందడం ఎవ్వరికైనా సాధ్యమే. ఆత్మీయుల్ని అనుచరులుగా మార్చేదీ... శత్రువుల్ని మిత్రులుగా మార్చేదీ మన సుమధుర హాసమే. మన రూపుని ముఖ తేజస్సుని మార్చే సత్తా మనసారా నవ్వే నవ్వుకే సాధ్యం.  అందుకే నవ్వుతూ బతుకుదాం. మౌనాన్ని వీడుదాం. 

    బరువైన మనసుల్ని తేలికపరస్తూ.... తెలియనివాళ్లును సైతం స్నేహితులుగా మార్చేస్తుందీ నవ్వు. కాలలకు అతీతంగా రుతువులను పట్టించుకోకుండా...నువ్వెక్కడుంటే నేనక్కడుండా....ఎల్లప్పుడూ మనతో పాటే హచ్ ప్రకటనలో కుక్కపిల్లలా ఎప్పుడు మనతో పాటే ఉండే ఏకైక సంపద మన నవ్వే. అందుకే ఎంత పెంచితే అంత పెరుగుతుంది. షేర్ మార్కెట్ తో సంబంధం లేకుండా శరవేంగంతో పెరిగే సంపద మన మనసుల్లో పుట్టి పెదవులపై పరిమళించే మన నవ్వే. అందుకే వీలైనంత ఎక్కువగా ఆనందంగా ఉందాం. హాయిగా జీవిద్దాం. అరువు నవ్వులకు దూరంగా ఉంటూ....మనసారా నవ్వుతూ... నవ్వుల్ని పంచుతూ పెంచుతూ ఉందాం. ఆనందమైన సమాజానికి బాటలు వేద్దాం.

Tuesday, June 14, 2011

ఆ ఆనందం పొందాలంటే.....




                      హైదరాబాద్ ఓ మంచి టూరిస్ట్ డెస్టినేషన్.అందంగా ఉంటుంది. వేల మందికి నిత్యం ఉద్యోగావకాశాలకు కేంద్రం. అన్నింటింకంటే మంచి వాతావరణం హైదరాబాద్ ప్రత్యేకత. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. కానీ, కొంత మందికి మాత్రమే తెలిసింది... అతి తక్కువ మంది మాత్రమే అనుభవించే ఆహ్లాదకర వాతావరణం వేరొకటి ఉంది. సూర్యోదయానికి ముందు హైదరాబాద్ అందాలు మనసుకి ఆనందాన్ని...ఆహ్లాదాన్నే కాదు చక్కని ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. 

      నిత్యం పొల్యూషన్ ముసుగులో మసిబారిన హైదరాబాదీ అందాలు.... నగరం నిర్మాణుష్యం అయ్యాక... స్వచ్ఛమైన మంచు బిందువులతో జలకాలాడి... వేకువనే వయ్యారంగా ముస్తాబయ్యి... అందంగా అందరికీ శుభోదయం పలుకుతాయి. రోజూ చూసే ప్రదేశాలే కొత్తగా కనిపిస్తుంటాయి. అరే ఈ ప్లేస్ ఇంత బాగుంటుందా... అని అనిపిస్తుంది.అయితే ఈ అదృష్టం మాత్రం కాసేపే. హైదరాబాదీలు లేచినంత వరకే....ఈ అద్భుత అవకాశాన్ని అందిపుచ్చుకునేవారు ఎందరూ... అంటే... జవాబు కొందరే అని చెప్పాలి.
       ప్రశాంత వాతావరణంలో పచ్చని పార్కుల్లో పొద్దున విరబూసే అందాలు పరవశాన్ని కలిగిస్తున్నాయి. మంచు బిందువుల్ని ముద్దాడిన పూలు అప్పుడప్పుడే హాయిగా విచ్చుకుంటూ.... పసిపాప నవ్వులా పలకరిస్తున్నాయి. ప్రకృతి ప్రదర్శించే పులకరింతలో ఔత్సాహికులు చేస్తున్న వ్యాయామ ప్రయత్నాలు చక్కని దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్నాయి.  వాళ్లు పొందుతున్న ఆనందం వర్ణనాతీతం. హైదరాబాదీలందరికీ ఈ ఆనందాలు దక్కాలని...సుందర ప్రశాంత హైదరాబాద్ అందాలను శుభోదయం వేళ అస్వాదించాలని ఆశిస్తున్నాను.   

Monday, June 13, 2011

ఓ నా ప్రియతమా....




    ప్రశాంత జీవితంలో అలా అలా ఓ లీలగా వచ్చి ఒడ్డుని తాకిన సాగరపు అలల్లా, సుతిమెత్తని నీ స్పర్శతో ఓల లాడించావు. మృధువైన మాటలతో.. నిజాయతీ చూపులతో మనసుకు గాలం వేశావు. అందం కంటే ఆత్మీయత, ఆదరణే ముఖ్యం అని తెలిసేలా చేశావు. అందరివాడిగా ఉండే నన్ను నీ వాడిగా మార్చేశావు. అసలు ఎవరిచ్చారు నీకా హక్కు...ధైర్యం. ఎప్పుడూ నాదైన ప్రపంచంలో హాయిగా విహరించే నన్ను నీ ఆలోచనల చుట్టూ తిరిగేలా చేసుకున్నావు. కమ్మని మాటలతో.. కల్మషం లేని ఆలోచనలతో ముందర కాళ్లకు బంధాలు వేస్తున్నావు. మునుపెన్నడూ లేని మధుర భావాల్ని పలికిస్తున్నావు. 


                  అందరూ నాతో మాట్లాడాలనీ, నా సలహాలు తీసుకోవాలని అనుకుంటుంటే... నా మనసు నీ వైపు పరుగులు తీస్తోంది.ఎందుకీ అలజడి. మదిలో తెలియని ఈ గుబులు... గుండెల్ని పిండేస్తోంది. తొలకరి చినుకుల పలకరింపులా...నీ మాటలు హాయిని, మత్తుని అందిస్తున్నాయి. నీ దరిచేరాలనీ... ఆత్మీయ ఆలింగనం చేయాలని మనసు ఆరాటపడుతోంది. గమ్మత్తైన ఈ అనుభూతిని మనసారా ఆస్వాదిస్తున్నాను. నీ పరిచయం నా భావావేశాన్ని మరింతగా పెంపొందించింది. లక్ష్యసాధనకు సరికొత్త ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపావు.  ఓ నా ప్రియతమా... ప్రియ నేస్తమా....

Sunday, June 12, 2011

ఆత్మీయస్పర్శ


        
         నీ పరిచయం ఓ అద్భుతమైన అనుభవం. ఎప్పుడు...ఏ క్షణాన కలిశావో గాని అప్పటి నుంచి ఏదో తెలియని ఓ ఆత్మీయ స్పర్శను నాలో కలిగించావు. ప్రతి క్షణం నీపైనే ధ్యాస. చూట్టానికి పెద్ద అందగత్తెవేమీ కాదు... మరీ సున్నితమైన మాట తీరుకూడా కాదు. కలసింది కూడా ఏమన్నా ఎక్కువ సార్లు కూడా కాదు. పోనీ నా బ్యాచ్ మేట్ వా కానే కాదు... కనీసం నా వృత్తికి సంబంధించిన వ్యక్తివి అస్సలే కాదు. అయినా నీలో ఏదో ఆకర్షణ.నా మనసుకి గాలం వేసింది. మదిలో తెలియని ఇది వరకూ ఎన్నడూ లేని అలజడిని రేపింది. ఎప్పుడూ హాయిగా నవ్వుతూ... అందరినీ నవ్వించే ఓ గలగల పారే సెలయేరులా ఉండే నాలో తెలియని మౌనాన్ని నింపావు. నీ ఆలోచనల్ని గుండెనిండా నిండేలా చేశావు. ఏమిటీ కొత్త అనుభవం. అర్థం అవుతున్నట్లుగానే ఉంది కానీ, స్బష్టంగా అర్ధం కావడం లేదు. సహజంగా అందరి మంచిని కోరుకునే నేను.... అందరికంటే నువ్వు ఇంకా బాగా ఉండాలని... అందరికంటే మంచి స్థితిలో ఉండాలని కోరుకుంటున్నాను. ఏదో తెలియని తీయనైన బంధం పెనవేసుకున్నట్లు అనిపిస్తోంది. 
           రోజూ నాకు కొత్త వ్యక్తులతో పరిచయం సర్వసాధారం. నీ పరిచయం... నీ జ్ఞాపకాలు మాత్రం ప్రతి క్షణం కొత్త దనాన్ని, నూతనోత్సాహాన్ని అందిస్తున్నాయి. నేను నిత్యం తిరిగే ప్రదేశాలు నీతో కలసి అడుగులేస్తుంటే...చాలా కొత్తగా కనిపిస్తున్నాయి. రోజూ చేసే పనులే నీ ఆలోచనలతో సరికొత్తగా  అనిపిస్తున్నాయి. ఎక్కడ పుట్టామో... ఎలా పెరిగామో... అంతెందుకు మనం ఎలా కలసుకున్నామో కూడా సరిగా తెలీదు. అయినా ఏమిటీ అనుభూతి. 
           అసలు మరలా ఎప్పుడు కలుస్తామో... అసలు కలుస్తామో లేదో... ఒకవేళ కలసినా జీవితాంతం ఒకరికొరుగా ఉంటామో లేదో కూడా తెలీదు. కానీ, నీ గురించి ఆలోచించడంలో మాత్రం ఏదో తెలియని ఆనందం ఉంది. మాటల్లో చెప్పలేని అనభూతి ఉంది. ఇది చాలు...గజిబిజీ జీవితంలో కూడా హాయిగా నీ ఆలోచనల్లో గడపడానికి. ఒకటిమాత్రం నిజం నువ్వు నా ప్రాణం. 

Thursday, May 26, 2011

ఓ చిన్న స్ఫూర్తి.



      పనికి తగ్గ ప్రతిఫలం అందరికీ కావాలి. అందుకోసం పోరాడాలి.  కానీ ఈ మధ్య కాలంలో ఫలితానికి తగ్గ పని చేయని వాళ్లు అన్ని ఆఫీసుల్లో తయారౌతున్నారనేది ఓ సర్వే. ఈ స్టేట్ మెంట్ నా మనస్సులో మెదులుతున్న సమయంలోనే కొంతమంది మహిళలు నా మదిలో కొత్త ఉత్సాహాన్ని... ఉత్తేజాన్ని కలిగించారు. వాళ్లే హైదరాబాద్ మహానగరంలో ఆర్టీసీ బస్సుల్లో విధులు నిర్వహిస్తున్న మహిళా కండక్టర్లు.నిజంగా వాళ్లు చేస్తున్న ఉద్యోగాలకు జీతం అన్న మాట చాలా తక్కువే అనిపిస్తుంది. 40 డిగ్రీల వేడి, దానికితోడు విపరీతమైన పొల్యూషన్ వీటిలో కాకీ యూనిఫాం ధరించి, కిక్కిరిసిన ప్రయాణికుల మద్య బస్సులో ఈ చివరి నుంచి ఆ చివరి వరకూ తిరగుతూ విధుల్ని నిర్వహించడం మామూలూ విషయం కాదనిపించింది. అడపాదడపా తగిలే పోకిరి కాలేజీ కుర్రాళ్ల వెకిలి చేష్టల్ని ఎంతో ఓర్పుతో నేర్పుతో భరిస్తూ విధుల్ని నిర్వహిస్తున్న మహిళా బస్సు కండక్టర్లకు హ్యాట్సాఫ్ చెప్పాలనిపిస్తోంది. 

         ఆఫీసులో బాసు అదనపు పని చెప్పినప్పుడో...మూడ్ బాలేనప్పుడు వేరే వర్క్ చేయాల్సినప్పుడు మనకు ఎక్కడ లేని కోపంతో పాటు చిరాకు... ఈ రెండింటితో కూడిన విసుగు కలసి ఒక్కసారిగా పుట్టుకొస్తాయి. కానీ, ఏం చేయలేని పరిస్థితి. ప్లాస్టిక్ నవ్వుతో అనీజీగానే పని తూతూ మంత్రంగా కానిచ్చేస్తాం. మన చుట్టూ ఉండేవాళ్లందరి కంటే ఓ రకంగా చెప్పాలంటే ప్రపంచంలో మనమే తెగ కష్టపడి పోతున్నట్టు...ఫీలైపోతాం. ఇలా మనకుండే అకాశాలను మరచిపోయి కొన్నిసార్లు ప్రవర్తిస్తుంటాం. ఇలా వ్యవహిరించేవాళ్లలో నేను కూడా ఒకడిని.   
        మంచి పనుల్ని చేయడం... మంచిగా మాట్లాడటం...ఎదుటి వాళ్లను ఇబ్బంది పెట్టకుండా జీవించడానికి మించినది వేరొకటి లేదు. అంతేకాదు ఎదుటి వారి శ్రమను గుర్తించడం కూడా చాలా గొప్పతనమే. అందుకే ఫలితానికి తగ్గ శ్రమను కాదు ఇంకా ఎక్కువ సేవల్నే అందిస్తున్న మహిళా కండక్టర్లకు బ్లాగ్ ద్వారా నా అభినందల్ని తెలియజేస్తున్నాను.  

మంచి మనసుకు స్వాగతం.


         మంచి మనసుకు స్వాగతం. మంచి మనిషికి సుస్వాగతం. మనిషి ఎంతో సాధించాడు. అనుకున్న లక్ష్యాలన్నింటినీ అందుకోగలిగాడు. రాకెట్ వేగంతో సరికొత్త ప్రయత్నాలను చేస్తున్నాడు. పక్షిలా గాలిలో ఎగరడం, చేపలా ఈదడం ఒకేటేమిటీ ఎన్నో అద్భుతాలను చేశాడు. చేస్తున్నాడు. కానీ, మనిషిని అనే విషయాన్ని మరచిపోతున్నాడు. మనుషులకు ఉండాల్సిన మానవత్వం, ప్రేమ, సహనం, ఆలోచనల్ని పంచుకోవడం ఇలా సృష్టిలో మనకు మాత్రమే సాధ్యమైయ్యే గొప్ప అవకాశాల్ని కాలరాస్తున్నాడు. ఫలితం జీవితమే అంధకారం. 


      సంతోషం, బాధ, ఆనందం, విచారం, ఆవేశం, ఇలా భావోద్వేగాలను సక్రమంగా పలికించలేకపోతున్నాం. కారణం యాంత్రికమైన జీవితం కాదు, యాంత్రికమైన ఆలోచనా విధానం. వేలల్లో జీతాలు సంపాదించడం...గడియారం ముల్లులా గొడ్డు చాకిరీ చేయడం... అలసి ఏవో నాలుగు మెతుకులు తిన్నామా, లేకపోతే ఓ కోటర్ మందు కొట్టి పడుకున్నామా ఇదే లోకంలో గడిపేస్తున్నాం. అందమైన జీవితాన్ని మనసారా ఆస్వాదించలేకపోతున్నామనే దిగులు చాలా మందిలో పెరిగిపోతోంది. కారణాలు ఏవైనా ఉండొచ్చు కానీ, పరిష్కారం మాత్రం కలసిమెలసి ఉండడం. పనిని పంచుకోవడం, ప్రేమను పెంచుకోవడం, మనసు విప్పి మాట్లాడుకోవడం, మనసారా నవ్వుకోవడం. కచ్చితంగా ఇవే.  జస్ట్ వీటిని పాటిస్తే చాలు.... మనకంటే కంటే వేరే అదృష్టవంతలు ధనవంతులు వేరొకరు ఉండరు.
            ఇదంతా ఏదో వేదాంతం కాదు, హితబోధ అంతకన్నా కాదు, మనసులో పేరుకుపోయిన బాధ, ఆవేదన, వాటిలోంచి వచ్చిన పరిష్కారం.... మా ఆఫీసులో పనిచేసే సహోద్యోగి దుర్మరణం. అది కూడా పెళ్లైన మూడో రోజుకే అకాల మరణం కొనితెచ్చుకున్న తీరు కలచి వేసింది. కారణం కోసం వెతికితే తన మనో వేదనను పంచుకునే వాడు కరవై కడకు...ప్రాణం తీసుకున్న వైనం. 
                  మనసున్న ప్రతి వాడు మహరాజే. మనందరి మనసుల్ని మానవత్వపు పరిమళలాలతో నింపుదాం. మమతల మందిరాలుగా తీర్చిదిద్దుదాం. ప్లీజ్ దయచేసి మన సంతోషాలని,ఆనందాలని, నిజయాల్ని, బాధల్ని పంచుకుందాం. భావాలను పంచుకునేందుకు బంధుత్వమే అవసరం లేదు. మానవత్వం చాలు.

Sunday, April 24, 2011

ఓం సాయిరాం.









     కోట్లాదిమంది  ఆరాధ్య దైవం సాయిబాబా. ఆయన నిష్ర్కమణం చాలా బాధాకరం. ఆయన దేవుడా... దైవ స్వరూపమా... ఆయన మంత్రాలతో అందరిని ఆకట్టుకుంటారా... ఏమో ఇవేమీ నాకు తెలీవు.కానీ, ఆయన సామాన్య మనిషి మాత్రం కాదు. మనుషుల్లో గొప్పవాడు. మానవ సేవే మాధవ సేవ అని మనసా వాచా  కర్మనా నమ్మిన వ్యక్తిగా నేను భావిస్తాను. ఆయన ప్రభోదించిన సూక్తులు... ఆచరించిన జీవనశైలి, సమాజానికి చేసిన సేవ అద్భుతం.



    కష్టాల్లో ఉన్న వాడిని ఆదుకునే వాడే దేవుడైతే... అనారోగ్యంతో క్షీణిస్తున్నప్పుడు ఆపన్న హస్తం ఇచ్చేవాడే భగవంతుడైతే... పైసా కూడా ఇచ్చుకోలేని నిరుపేదలకు ఉచితంగా సరస్వతీ కటాక్షాన్ని అందించేవాడే దైవాంశసంభూతుడైతే... కచ్చితంగా సాయిబాబా భగవంతుడే. ఆయన చేసిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు గానీ, రాయలసీమ వాసుల దాహార్తిని తీర్చడానికి ఆయన చేసిన భగీరథ ప్రయత్నం గానీ అజరామరం.


               తన జీవితాంతం ప్రేమ, శాంతి, ధర్మం, సత్యం, అహింసను పంచుతూ వాటిని సమాజంలో పెంచేందుకు బాబా చేసిన కృషి అందరికీ... ఇప్పటికీ ఎప్పటికీ ఆచరణీయం. ఆయన జన్మించిన కాలంలో నేను పుట్టడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన మరణం ప్రస్తుత సమాజానికి తీరని లోటు.

Friday, April 8, 2011

మేరా మీడియా మహాన్.


     ఈ మధ్య ఎవరి నోట విన్నా మీడియా అంటే కేవలం నెగిటివ్ వార్తలకే పరిమితం అయిపోయిందండి. డబ్బులు తీసుకుని వార్తలు రాస్తారండి. మేం పత్రికల్ని, టీవీ న్యూస్ ను చూడటం మానేసి చాలారోజులు అయిందండి. ఎక్కడికి వెళ్లిన సాధారణంగా వినిపించే మాటలు. అదే ఆడవారైతే ఆ పాడు న్యూస్ చానెల్స్ గురించి ఎందుకు అడుగుతారులెండీ, పొద్దున్న లేచింది మొదలు పడుకునే వరకూ ఆక్కడ వాళ్లు చచ్చారు. ఇక్కడ ఈ అమ్మయిపై యాసిడ్ పోశారు. అనే వార్తలేగా... ఇంకేం చూపిస్తారు ఆ చానెల్స్ వాళ్లు. అందుకే మీడియా అంటేనే విరక్తి కలుగుతోంది అమ్మా. ఇది సగటు మనిషి మీడియాపై ఏర్పరచుకున్న అభిప్రాయం. ఇలాంటి మాటలు ఎప్పుడు విన్నా ఓ మిడియా ప్రతినిధిగా చాలా బాధ కలిగేది. కానీ ఏం చేయలేని పరిస్థితి.  నిప్పులేనిదే పొగరాదన్నట్లు... కొంత వరకూ మీడియా తీరు మారడం వల్లే ప్రజల్లో చులకన భావం ఏర్పడింది. 
    కానీ ఇలాంటి మాటలు విన్నప్పుడల్లా నాలో నేనే అనుకునేవాడిని ఏదో ఒక రోజు మీడియా తన విశ్వరూపం చూపిస్తుంది. ఎవరూ ఊహించని విధంగా సరికొత్త సంచలనానికి కేంద్ర బిందువుగా మారుతుందని.అదే జరిగింది. భారతదేశంలో పేరుకుపోతోన్న అవినీతిని అంతమొందించాలంటూ సమర శంఖం పూరించిన అన్నా హజారేకు మీడియా ఎవరూ ఊహించని రీతిలో మద్దతు తెలిపింది. అన్నా హజారే స్ఫూర్తిని ఆసేతు హిమాచలం వరకూ వినిపించేలా చేసింది.నిన్న మొన్నటి వరకూ చాలా మందికి తెలియని అన్నా హజారే ఇప్పుడు ఓ రోల్ మోడల్ గా మారిపోయారు. అవినీతిని అంతమొందించేందుకు ప్రతి ఒక్క భారతీయుడు కథం తొక్కుతున్నాడు. ఎన్నో ఏళ్లుగా తమ తమ గుండెల్లో దాచుకున్న ఆవేదనను ఆచరణలో చూపిస్తున్నారు.   ఎవరూ  ఊహించని విధంగా దేశంలో అణువణువూ అవినీతి రహిత భారత్ కావాలని నినదిస్తుంది. ఇందుకోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధం అని తెగేసి చెబుతున్నారు. ఈ సరికొత్త మార్పు మంచిదే. 


ఈ ఊపుకి కారణం ఒకే ఒక్కడు అతడే అన్నా హజారే. కానీ, తన స్పూర్తికి వేయి ఏనుగుల బలాన్ని అందించింది మాత్రం కచ్చితంగా మీడియానే. ఓ వైపు పత్రికలు, మరోవైపు ఎలక్ట్రానిక్ మీడియా హజారే చేపట్టిన దీక్షను ఓ ఉద్యమంలా భావిచింది. మరో స్వాతంత్య్ర సంగ్రామంగా తీర్చిదిద్దింది. ఫలితం మారుమూల పల్లెల్లోనూ ఇప్పుడు అన్నా హజారే మాటే వినిపిస్తుంది. నిన్నటి వరకూ మొగలిరేకులు సీరియల్ గురించి మాత్రమే మాట్లాడుకునే ఆడాళ్లు అన్నా హజారే ఎవరూ...అతని దీక్ష ఫలిస్తుందా అని వాకబు చేస్తున్నారు. దటీజ్ పవర్ ఆఫ్ మీడియా  .

ఒక్క అడుగు వేయి మైళ్ల ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది. ఒక్క చినుకుగా ప్రారంభమైన వర్షం.. వానగానూ, కొన్ని సందర్భాల్లో జడివానగానూ మారుతుంది. ఒక్క చిన్న ప్రయత్నం సరికొత్త మార్పుకు శ్రీకారం చుడుతుంది. 
భారత్ దేశాన్ని ఓ సూపర్ వపవర్ గా చూడాలనుకుంటోన్న చాలా మంది ఆశల్ని నేరవేచ్చడంలో మీడియాది కీలక పాత్ర. ఇప్పటి వరకూ ఎన్ని జరిగినా ఎలా జరిగినా, అవినీతిపై జరుగుతోన్న ఈ పోరులో భాగమైన మీడియాకి జై కొట్టాల్సిందే.ఎందుకంటే ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత క్రికెట్ వరల్డ్  కప్ సాధించిన క్రికెట్ జట్టు సంబరాలను కూడా పక్కన పెట్టేలా చేసిన మీడియా నిజంగా గ్రేట్డ్ కాదని అనగలమా.  అందుకే ఓ మీడియా ప్రతినిధిగా  గర్వంగా బుతున్నాను మేరా మీడియా మహాన్ అని. ఇదే స్ఫూర్తితో మరిన్ని చారిత్రాత్మక సంఘటనల్లో  మీడియా కీలక పాత్ర పోషించాలని, ప్రతి ఒక్కరూ మీడియా గ్రేట్ అని నినదించే రోజు రావాలని ఆకాంక్షిస్తున్నాను. 

Wednesday, April 6, 2011

కింకర్తవ్యం...



      ఏడు పదుల స్వతంత్ర్య భారతావనిలో లెక్కకందని అవినీతి స్కాములు. హవాలా, బోఫోర్స్, హర్షద్ మెహతా స్కామ్, స్టాంపుల కుంభకోణం, పశుదానా కుంభకోణం, టూ జీ స్పెక్ట్రమ్ కుంభకోణం... ఇలా ఎన్నని భరించాలి. ఇంకెన్నింటిని చూడాలి. ఒక్కొక్క స్కాము లెక్కకందని వేల కోట్ల రూపాయలు. దోచుకున్న వాడు దర్జాగా రాజులా తిరగే రాజ్యం మన దేశమంటే అతిశయోక్తి కాదేమో. ఒక్క సారి ఈ స్కాములేవీ జరగకుండా ఉంటే... ఆ డబ్బంతా సమాజాభివృద్ధి కార్యక్రమాలకు కర్చుబెడితే... గడచిన ఏడు దశాబ్దాల్లో ఇండియా అమెరికానే శాశించే స్థాయికి వెళ్లేది. సిగ్గుమాలిన రాజకీయ నాయకుల దౌర్జన్యాలకు, దాష్టికాలకు భారతావని ప్రతిసారి భంగపడుతునే ఉంది. 
                     స్వేచ్చా ఊపిరిలున్న సశ్యశ్యామల భరతమాతను బజారుకీడుస్తున్న రాజకీయ రాబందుల భరతం పట్టాలి. తెల్లారిందా...తిన్నామా... సొల్లు కొట్టామా... పడుకున్నామా... ఇదే జీవితాన్ని ఇంకెన్నాళ్లు గడపుదాం. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎన్నాళ్లు ఎదురుచూద్దాం. ఇంకెన్నాళ్లు అవినీతి ప్రభుత్వాల నీలినీడల్లో బతుకుదాం.ఇంకెన్నాళ్లు చేవ చచ్చిన వాళ్లుగా జీవిద్దాం.

    విజ్ఞతగల ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణం రానే వచ్చింది.         జన్ లోక్్పాల్ బిల్లుకోసం పాటుపడుతోన్న ప్రముఖ సంఘ సంస్కర్త అన్నాహజారే దీక్షకు మద్దతు తెలుపుదాం. చేయి చేయి కలుపుదాం. చరిత్రను తిరగరాద్దాం. భారతీయులుగా భరతమాత బంగరు భవితవ్యానికి పునాదులు వేద్దాం. 

Sunday, April 3, 2011

జై జై నాయకా...


                                జై జై నాయకా...


     నాయకుడంటే ఎవరు. ఎలా ఉంటాడు. ఎలాంటి లక్షణాలు ఉంటే నాయకుడౌతాడు. కేవలం శక్తి ఉంటే చాలా. నమ్ముకున్న వాళ్లకి న్యాయం చేసేలా ఉండాలా...కలసి కట్టుగా అందరినీ విజయ తీరాలకు చేర్చేవాడై ఉండాలా...అసలు ఇలాంటి ఆన్ని లక్షణాలు ఒకే వ్యక్తిలో ఉంటాయా....వీటన్నింటికి సమాధానం ఒక్కటే...ఒక్కడే... అతడే ఇండియన్ క్రికెట్ కెప్టెస్ట్ మహేంద్ర సింగ్ ధోని. 


    కోట్లాది మంది ఆశ. శ్వాస. క్రికెట్ వరల్డ్ కప్ సమరంలో భారత్ విశ్వవిజేతగా చూడాలన్నదే జీవితాశయంగా మారిన ఎందరో అభిమానుల ఆకాంక్ష. ఇవన్నీ నెరవేరిన అద్భుత క్షణం. ఈ క్షణాన్ని వర్ణించడం అసాధ్యం. ఆ ఆనంద క్షణాల్ని ఆస్వాదించడం మాత్రమే మన ముందున్న తరుణం. హోరా హోరీగా సాగిన టోర్నీ మ్యాచ్ లు. ప్రతి మ్యాచ్ ఓ ఫైనల్ గా మారిన విషమ పరిస్థితి.ఎటు చూసినా నరాలు తెగే ఉత్కంఠ. స్డేడియంలో కిక్కిరిసిన అభిమానుల కోలాహలం ఓ వైపు... లెక్కకందని యావత్ ప్రపంచ క్రికెట్ అభిమానుల ఆకాంక్ష మరోవైపు.... వీటన్నింటిని నిలబెట్టాలన్న ఒత్తిడి మరోవైపు...ఇలాంటి విషమ పరిస్థితుల్లో ఎలాంటి తడబాటు లేకుండా జట్టును విజయ లక్ష్యాన్ని చేర్చడం మామూలు విషయం కాదు. విజయం సాధించిన తర్వాత ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తారు. అదే...తిరగబడితే ఆ తీరే వేరుగా ఉంటుంది. వీటన్నింటినీ లెక్క చేయకుండా చిరకాల కలను సాకారం చేసింది మన ఇండియన్ టీమ్.  
               ఎంతో నైపుణ్యం గల మంచి ఆటగాళ్లతో కూడిన టీమ్ ను చక్కగా ఉపయోగించుకోవడంలో ధోని వంద శాతం సక్సెస్ అయ్యాడు. క్లిష్ట పరిస్తిత్తుల్లో ఎత్తులపై ఎత్తులు వేసి తానేంటో నిరూపించాడు. టీం కూర్పులో తనదైన మార్కు కనిపించేలా చేశాడు. విమర్శకుల నోళ్లను తనదైన శైలిలో మూయించాడు. కుర్రాల్లోలో ఉండే ఫైర్ ను ఫీల్డ్ లో పండించడంలో విజయం సాధించాడు. అతిరథ మహారథుడైన సచిన్్తో సైతం సెహభాష్ అనిపించుకున్నాడు. సచిన్ చిరకాల కోరికను వందకోట్ల మంది అభిమానుల సాక్షిగా నెరవేర్చాడు.   




    అంతేకాదు టోర్నీ మొత్తంలో ఫెయిల్  అయినా డూ ఆర్ డై ఫైనల్ మ్యాచ్ లో తనేంటో నిరూపించాడు. కీపర్ గా, కెప్టెన్ గా విధుల్ని నిర్వరిస్తునే...ప్రత్యర్ధుల్నినిలువరించే ప్రణాళికలు రచించడం మామూలు విషయం కాదు.విపరీతమైన ఒత్తిడిలోనూ నిశ్ఛలంగా... మిస్టర్ కూల్ వ్యక్తిత్వంతో భారత్ ను విజయ పథంలో నడిపిన ధీరోధాత్తుడు ధోని.


                పనికిమాలిన బేషజాలతో తన్నుకు చస్తోన్న ఎంతోమంది రాజకీయ పార్టీల అధ్యక్షులకు , రాజకీయ నాయుకులకు, చిన్న చిన్న విజయాలకు విర్రవీగే ప్రభుద్దులకు  ధోనీ నడత ఓ దిక్సూచి. యూత్ కు నిజంగా ఓ పెద్ద ఇన్సిపిరేషన్. మరోసారి టీం ఇండియాకు కంగ్రాట్స్  చెబుతూ..... జయహో....    

Tuesday, March 22, 2011

అందమైన అనుభవం.


       
అందమైన జీవితాన్ని ఆహ్లాదంగా గడపడమే జీవితానికి నిజమైన సార్థకత. ఎటుచూసినా పచ్చికబైళ్లు, చల్లని ప్రశాంతమైన గాలి, కొబ్బరాకుల మధ్యనుంచి దోబూచులాడుతూ వెన్నెల కాంతుల్ని అందించే చందమామ. లోగిడిలో అందరి మధ్యలో పెద్ద గిన్నెలో వేడి వేడి అన్నాన్ని ఎంచక్కా పెద్ద పెద్ద ముద్దలుగా కలిపి ఒక్కొక్కరికి అందిస్తున్న అమ్మ, ఆవురావురు మంటూ లొట్టలేసుకుని తినే పిల్లలు...వారి అల్లరి... ఆ ఆనందం. మాటలకందనిది. ఇవేం పెద్ద పెద్ద కోరికలూ కావు, అసాధ్యమైన పనులూ కావు. ఒకప్పటి మన పెద్దోళ్లు ఎంచక్కా అనుభవించిన నిత్య కృత్యాలే. కాలంతో పాటే మనం...మన అలవాట్లు మారిపోవడంతో ఇవి ఓ అందమైన కలలుగానే మిగిలిపోతున్నాయి. కనీసం ఇలాంటి అపురూపమైన అనుభూతుల్ని అందించేవి చక్కని పుస్తకాలే. ఇదే కోవలో ఈ మధ్య నేను చదివిన మంచి పుస్తకం మతాబులు. 
                   మతాబులు పుస్తక రచయిత పాత్రికేయ మిత్రుడు.... ఆప్యాయంగా అన్నా అనిపిలుచుకునే కొవ్వలి రామకృష్ణ పరమహంస. మతాబులు, మొక్కుబడి, ఉయ్యాలబల్ల, అక్షింతలు, కల్లోల కాశ్మీరంలో కోయిల మళ్లీ కూసింది, కొంగుముడి, పిన్నీసు, రంగిచూపు, కనువిప్పు, మా కాలంలో అయితే, ఆ జ్ఞాపకాలే మధురాతి మధురం, శ్మశాన వైరాగ్యం. ఇలా పన్నెండు కథలు మతాబులు పుస్తకంలో చక్కగా ఒదిగిపోయాయి. అచ్చమైన తెలుగులో స్వచ్ఛమైన తెలుగుదనాన్ని నింపుతూ కథల్ని చక్కాగా రాశారు రచయిత. 
   ఉరుకుల పరుగుల జీవితంలో స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన ఆనందాల్ని పొందలేని వారి సంఖ్య పెరుగుతుందనే చెప్పాలి.కారణాలేవైనా కావొచ్చు. ఇలాంటి వారికి ఓ దివ్యఔషదం ఇలాంటి పుస్తకాలే. ఉయ్యాలబల్ల కథలో చిన్ననాటి అనుభవాల్ని గుర్తు చేసుకునే ఓ వ్యక్తి...ప్రకృతితో పాటు తన బాల్యస్మృతుల్ని గుర్తుకుతెచ్చుకోవడాన్ని ఎంతో ఆర్ధ్రతతో రాశారు. చదవుతున్న ప్రతి ఒక్కరికి తమ తమ బాల్యస్మృతుల్ని జ్ఞప్తికి వచ్చేలా రచన చేశారు. ఇక పిన్నీసు అనే కథలో జీవితంలో విజయం సాధించిన ఓ వ్యక్తి తన విజయ పథంలో ఓ చిన్న వ్యక్తి చేసిన పిన్నీసు సాయం ఆ తర్వాత ఆ సంఘటన ఆయనలో తెచ్చిన పెనుమార్పులు నాలో ఆసక్తిని పెంపొందించింది. అంతేకాదు, చిన్న చిన్న విషయాలు, సంఘటనలు ఎంత ప్రాధాన్యతను సంపాదించుకుంటాయో తెలిసేలా ఈ కథ ఉంది. మొత్తం అన్ని కథలు నాలో సరికొత్త అనుభూతిని నింపాయి.     
              ఏదో సాధించాలని...గొప్పవాళ్లని కలవాలని... వాళ్లను ఆదర్శంగా తీసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అందులో నేను కూడా ఒకడిని.అయితే మన చుట్టూ ఉండే ప్రతి ఒక్కరిలో ఎంతోకొంత ప్రత్యేకత...తెలుసుకునే మంచి విషయం ఉంటుందని మాత్రం గుర్తించం. ప్రతి రోజు ఏదో ఒక సందర్భంలో మతాబులు పుస్తక రచయిత పరమహంస అన్నను కలుస్తుంటాను. అయితే తనలో ఇంత మంచి రచయిత ఉన్నాడని ఆలస్యంగా తెలుసుకున్నాను. పేరుకు తగ్గట్టుగానే ఈ మతాబులు చిదివిన ప్రతిఒక్కరిలో ఉత్తేజాన్ని.... ఉత్సాహాన్ని అందిస్తాయి. 







Tuesday, March 15, 2011

మనల్ని మనం కాపాడుకుందాం.

                                        


    విశ్వంలో ఎన్నో వింతలు మరెన్నో ఆసక్తిని కలిగించే అరుదైన సంఘటనలు. ఎన్నున్నా... అన్నింటిలోనూ అద్భుతమైంది మాత్రం భూమే. విశ్వాంతరాళంలో మరే ఇతర గ్రహాలకు లేని అరుదైన విశేషాలు భూమికి మాత్రమే సొంతం. ఓ సారి మనం నివశిస్తున్న భూమిని  పరిశీలిస్తే మరెక్కడా తారసపడని అపురూప జీవకోటి ఇక్కడే కనిపిస్తుంది. సుందర రమణీయ లోయలతో...పసు పక్ష్యాదులు, జీవ నదులు, కొండలు, కోనలు...వాగులు,వంకలు. సహజ సిద్ధమైన నీరు,స్వచ్ఛమైన గాలి, అహ్లాద పరచే ప్రశాంత వాతావరణం. ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ పోతుంటే.... ఎన్నో అద్భుతాలు... అశ్చర్యాల సంగమం మన భూ గ్రహం.  ఎంతమంది ఎన్నిసార్లు కొత్త విషయాలు కనుగొంటున్నా, ఇప్పటికీ. ఎప్పటికీ ఓ అద్భుతంగా ఉండే విశష్టత మనం నివశిస్తున్న మన భూమాతదే.
     పంచభూతాల్లో భాగమై సమస్త జీవరాశికి ఆవాశంగా  మారిన ఈ భూమికి కోపం వస్తే...ఎలా ఉంటుంది. ఒక్క క్షణంలో కకావికలం చేస్తుంది. ఏదో సాధించాం. ఎంతో అభివృద్ధి చెందాం. అని విర్రవీగుతున్న మానవాళికి ఒకే ఒక్క ప్రళయంతో  ఓ సవాల్ విసిరింది. భూకంపంతో పాటు సునామీగా వచ్చి టెక్నాలజీలో కొత్త పుంతల్ని తొక్కుతూ ప్రపంచాన్ని సాసిస్తున్న జపాన్ ను అతలాకుతలం చేసింది. ఇంతవరకూ ఎంత ఆస్తి, ప్రాణ నష్టం సంభవించిందో లెక్క కట్టలేనంత విషాదాన్ని మిగిల్చింది. నిన్నటి వరకూ ప్రపంచాన్ని జయించామని, టెక్నాలజీలో సూపర్ పవర్్గా నిలిచామని ఎగిరిగంతేసిన జపాన్ వాసుల్ని ఆపన్న హస్తాల కోసం ప్రపంచం ఎదుట నిలబెట్టింది. ఇది ప్రకృతి ప్రకోపాణికి ఓ చిన్న ఉదాహరణ మాత్రమే.


                               మనసుని ఆహ్లాద పరచాలన్నా, ఊహకందని ప్రళయాన్ని సృష్టించాలన్నా అది ప్రకృతికి మాత్రమే సాధ్యం. చేపలా ఈదడం నేర్చుకున్నాం. పక్షిలా ఆకాశ మార్గాన విహరించడం కనుకొగొన్నాం. అసాధారణంగా భావించిన అంతరిక్ష యానం చేశాం. కానీ, మనిషిలా బతకడం మరచిపోయాం.  మనకు జీవితంలో ఎప్పుడో....ఎక్కడో ఓ చిన్న సాయం చేశాడన్న వ్యక్తనే జీవితాంతం గుర్తుంచుకుంటాం. అవకాశం వస్తే రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తాం. అలాంటింది మన జీవిత ప్రధాయని, అను క్షణం అమ్మలా కాపడే భూమిని నిర్లక్ష్యం చేయడం తగునా. అభివృద్ది పేరిట భూమిని డొల్లగా మార్చేయడము మన తప్పిదం కాదా. జానెడు పొట్ట, కనురెప్ప మూసి తెరిచేలోపల పూర్తయ్యే మన జీవితం కోసం అపూరప సంపదను హారతి కాప్పూరంలా చేయడం పాపం కాదా. కనీసం ఇప్పటికైనా భూమిని   కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. వీలైనంతలో ప్రకతిని పరిరక్షించే పనుల్ని చేపడదాం. కాదు, మనల్ని మనం కాపాడుకుందాం.



Thursday, March 10, 2011

సిగ్గు పడాల...సంబరం చేయాలా...?


సిగ్గు పడాల...సంబరం చేయాలా...?

                వందల ఏళ్ళుగా సంపాదించుకున్న సాంస్కృతిక వైభవాన్ని ఒక్క సారిగా నెల కూల్చుకున్న చర్యని ఏమని వర్ణించాలి. ఎలా జీర్ణించుకోవాలి. మనకు ఎం కావాలి... ఎలా సాధించుకోవాలి. మిలియన్ మార్చ్ సందర్భంగా ట్యాంక్ బ్యాండ్లో విగ్రహాలను ద్వంసం చేసిన ఘటన కేవలం మన రాష్ట్ర చరిత్రలోనే కాదు యావత్ భారత దేశంలో జరిగిన అనేక దుర్మార్గపు చర్యల్లో ఒకటిగా నిలిచిపోతుంది. ఆటవిక చేష్టలకు పరాకాష్ట. ఎటుపోతున్నాం. ఏమైపోతున్నాం. ఇదేనా మనం నేర్చుకున్న విజ్ఞానం. సంపాదించిన సాంస్కృతిక వైభవం.     

 మన అమ్మ పాలు తాగి రొమ్మునే కోసేసిన చందం. అన్నం తినే ఎ ఒక్కడు చేయలేని పాశవిక చర్య. ఎవరు ఎలా స్పందించినా, ఏవిధంగా కన్డిన్చినా, జరిగిన ఘోరాన్ని కప్పి పుచ్చలేరు. కేవలం బొమ్మల్ని కుల్చినందుకే అంత రోషం వచ్హిందా అని ప్రశ్నిస్తున్న చవక బారు నేతలు, మీడియా పెద్దల పై జాలేస్తుంది. కేవలం ఆ విగ్రహాలను బొమ్మలుగానే చూస్తున్న వాళ్ళ విజ్ఞత నిస్చేస్తుడ్ని చేస్తోంది.  
                        అన్నమయ్య,కృష్ణ దేవరాయులు, క్షేత్రయ్య, నన్నయ, ఇలా ఒకరేంటి ఎందరో మహానుభావులు మన తెలుగు భాషను, తెలుగు జాతి గౌరవాన్ని, గొప్పతనాన్ని విశ్వవ్యాప్తం చేసారు. వీళ్లా మన కుటిల కాంక్షలకు, చవక బారు రాజకీయ నీచ ప్రయోజనాలకు, బలికావాల్సింది. ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్ని చూస్తూ, వాటిలో జీవిస్తున్నాం. ఓ సారి కళ్ళు మూసుకుని ఆలోచిస్తే మనసున్న...మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరు సిగ్గు పడక తప్పదు. మనిషిగా పుట్టిన ప్రతివాడు స్పందించాల్సిన దురదృష్ట సంఘటన.   
                          ఇవన్ని ఉద్యమంలో భాగమే అనే వాడు ఒకడు. మా జీవిత్లతో పోలిస్తే ఇదేన్తా అనేవాడు ఒకడు. ఆ బొమ్మల్లో మావాడు ఒక్కడు కూడా లేడురా, అంటాడు వేరొకడు. ఇలా ఆలోచించే వాళ్ళుపై జాలేస్తుంది. 
    కేవలం ఒక్క బాబ్రీ మసీదు కూలిచిన రోజుని ఇప్పటికీ, బ్లాక్ డే గా పాటిస్తున్న గొప్పతనం మన జాతిది. కుల మతాలకు అతీతంగా, భిన్నత్వంలో ఏకత్వంగా జీవిస్తున్న అరుదైన సమాజం మనది. ఇది ఎ ఒక్కరి వల్లో, ఒక్క ప్రాంతం వారి ప్రతిభాతోనో సాధించుకుంది కాదు. సమిష్టిగా సంపాదించుకున్న సాంస్కృతిక వైభవం. 
        ఇంకా ఇలాంటి పైశాచిక చర్యలు కట్టి పెట్టాలి. నిన్నటి ఘటన ఒక ప్రాంతం వాళ్ళ వైకరికి నిదర్సనం అనుకుని సర్ది చెప్పుకుందామా... ఇన్నేళ్ళు గడుస్తున్నా ఇంకా వాళ్ళు ఆటవికంగానే బతుకుతున్నారని అనుకుందామా.... ఏదేమైనా...
       ఆహా ఓ భారతావని ఎలాంటి భావిభారత పౌరిల్ని కన్నవ మ్మా, నీ భవిష్యతు ఊహించుకుంటే భయం వేస్తోంది. 

జయహో జర్నలిస్ట్

                                          
         జర్నలిజానికి వన్నెతెచ్చిన ఎందరో మహానుభావులు. వాళ్ళందరికీ వందనాలు. నిరాడంబర జీవితం. సమ సమాజ నిర్మాణం. ప్రాణ త్యాగానికైనా సిద్ధం. ఇదంతా ఎవరో దేశ నాయకుడికి సంభందించిన పలుకులో... లేక ఓ సెలబ్రిటికి చెందిన మాటలు కావు. నికార్సైన ఓ పాత్రికేయుని జీవిత అనుభవాలు. సమాజం నాకేం ఇచ్చిందని కాకుండా... నేను సమాజానికి ఎం చేశాను అని నమ్మి... జీవితాంతం తన నమ్మిన సిద్ధాంతాల కోసమే జీవించిన పాతతరం పాత్రికేయుని జీవన ప్రస్తానం. ఇప్పటి పాత్రికేయులకు ఓ నిఘంటువు. అతనే సముద్రాల సత్యనారాయణ. తెల్ల చొక్కా.. తెల్ల ప్యాంటు...ఇరవై నాలుగు ఇంచెలు వుండే సైకిలు...సంకలో ఖాదీ సంచే... ఆ సంచీలో ఓ దస్తా తెల్ల కాగితాలు. రెండు పెన్నులు... ఓ స్కేలు... ఇవే అతని ఆయుధాలు. 
         బడుగు బలహీన వర్గాల కోసం జీవితాంతం అలుపెరుగని పోరాటం చేసిన ఓ అక్షర సైనికుడు. విజయనగరం జిల్లా పార్వతీపురం అతని పాత్రికేయ జీవితానికి నాంది. స్వాతంత్ర్య సంగ్రామం చివరి దశలో పుట్టిన ఆయన కమ్యూనిజం అభిమానాన్ని పెంచుకున్నారు. బాల్యంలో అతని మనస్సుపై పడిన భావాల్ని నిజం చేసుకునే పనిలో పాత్రికేయ వృత్తితి చేపట్టారు. తన లక్ష్య సాధనలో భాగంగా తొలినాళ్ళలో జైలు జీవితాన్ని కూడా అనుభవించారు. 
                 మహిళా సాధికారత కోసం, విద్యా విజ్ఞాన అవకాశాల కోసం ఆయన చేసిన కృషి, రాసిన ఆర్టికల్స్ భావి తరాలకు ఓ దిక్సూచి. ఉత్తరాంధ్ర ఏజెన్సీలో జరిగే అమానుషాలపై ఆయన ఎక్కుపెట్టిన పెన్ను.. భాదిత ప్రజల జీవితాల్లో వేయి వేల కాంతుల్ని వెలిగించింది. మైళ్ళకు మైళ్ళు ప్రయాణం చేస్తూ.. బడుగు బలహీన వర్గాల వారి అభివ్రుది కోసం, కష్టాల్లో కొట్టు మిట్టడుతున్న అభాగ్యుల కళ్ళల్లో ఆనందాన్ని నింపేందుకు సముద్రాల చేసిన అక్షర యుద్ధం అజరామరం. అనిర్వచనీయం. కేవలం పాత్రికేయునిగానే కాకుండా.. మంచి రచయిత గానూ, సముద్రాల తన సత్తా చాటారు. నిరక్షరాస్యతను రూపు మాపే క్రమంలో రూపొందించిన అక్షర క్రాంతి కార్యక్రమమలో పలు నాటకాలను రాశారు. ఉత్తరాంధ్ర గిరిజన సంస్కృతి కళా వైభవం ధింసా నృత్యాన్ని కాపాడేందుకు పలు ప్రదర్సనలు ఇప్పించారు. 
               వైద్య రంగంలో పెరిగిపోతున్న అవినీతిపై సంధించిన సెటైర్...ధర్మాసుపత్ర్హి నాటకం. ఈ నాటికలో ప్రధాన పాత్రను పోషించారు. ఉత్తరాంధ్ర మాండలికంలో తను రాసిన పాటలను తమిళంలోకి తర్జుమా చేయించి....1996 ప్రాంతంలో మద్రాసు నగర వీధుల్లో ప్రదర్సనలు ఇప్పించారు. జాతపు, సవర, గదబ, గోండు, కోయ దొర వంటి గిరిజన తెగల జీవన శైలిపై అద్భుతమైన పట్టు సాధించారు. అంతే కాదు వాళ్ళ అభివ్రుదికోసం అలుపెరుగని పోరాటం చేశారు. అలా రాసిన నాటికే గెంజిమెతుకులు. నాటిక. అప్పట్లో విజయనగర, శ్రీకాకుళం జిల్లాల్లో ఓ సంచలనం. తన కలం బలంతో అధికార యంత్రాంగాన్ని మన్నెం బాట పట్టించిన కార్య శీలి సముద్రాల. 
                      1995లో వేల్ఫేరే సొసైటీని స్థాపించి, కళాకారులకు శిక్షణను ఇప్పించడంతో పాటు సామాజిక సమస్యలపై మాండలికంలో పాటలు రాసి, ప్రజల చేత నీరాజనాలు అందుకున్న అక్షర సైనికుడు సముద్రాల సత్యనారాయణ. మహిళలపై జరుగుతున్న అక్రమాలు,అన్యాయాలపై స్పందిస్తూ పల్లెపడుచు, సుశీల పెళ్లి, పరివర్తన వంటి నాటకాలను రచించి, వాటిల్లో ప్రధాన పాత్రలు పోషించారు.


                    సముద్రాల ప్రతిభకు పలు పురస్కారాలు, సత్కారాలు లభించాయి. 1997లో కేంద్ర మానవ వనరుల శాఖ సముద్రాలను ఫెలోషిప్ అవార్డ్తో సత్కరించింది. 1998లో జాతీయ స్థాయి ఇఫ్కర్సన్ సంస్థ బ్రైట్్మెన్్ అవార్డును అందజేసింది. 

         ఐఏఎస్ అధికారులు, స్వాతంత్ర్య సమరయోధులు, స్వచంద సంస్థలు ఆయన ప్రతిభను గుర్తించి ఇచ్చిన యోగ్యతా పత్రాలె పాపం అతను సంపాదించుకున్న ఆస్తి పాస్తులు. కడవరకు కాలాన్నే నమ్ముకున్న కార్యవాది. నిరాడంబర జీవితం...నిశ్చల మనస్సు... కలలో నైన నాది.. నా వాళ్ళు అనే చింతన లేకుండా ప్రజా శ్రేయస్సు కోసమే పాటు పడిన ఓ పాత తరం పాత్రికేయుడు. కాని. తన వళ్ళ ప్రయోజనం పొందిన బడుగుల మనస్సులో ఎప్పటికి చిరంజీవిగా వుండే ఓ పాత్రికేయ... అందుకో ఈ తరం నీరాజనాలు. నీ జీవితం మా తరానికి ఓ స్ఫూర్తి. జైహో జర్నలిస్ట్. 
   
నోట్...  ఇంతటి మహోన్నత  లక్ష్యాలున్న వారికి మనవడిగా పుట్టడం నా పూర్వ జన్మ సుకృతం.

Monday, February 21, 2011

కసబ్ కి ఉరి శిక్షే కరెక్ట్.....


          ముంబై మారణ కాండకు కారణం అయిన కరడుగట్టిన కసబ్ కు ముంబై హై కోర్ట్ విధించిన మరణ శిక్ష యావత్ భారతావని ముక్త కంట్టం తో సరైనదే అని చెప్పే క్షణం. న్యాయ వ్యవస్థ పై నమ్మకాన్ని పెంచే అద్భుత తీర్పు. ఇప్పటికే  ఈ విషయంలో చాలా ఆలస్యం చేశాం. దేశ ప్రతిష్టను, సమగ్రతను, శాంతి భద్రతలను చిన్నా భిన్నం చేసిన ఓ కసాయికి సరైన శిక్షనే ముంబై కోర్ట్ విధించింది. ప్రతి భారతీయుడి ఆశ, ఆకాంక్ష ఇదే. భారతీయుల మనో భావాలను దారుణంగా దెబ్బతీసే దారుణ ప్రయత్నానికి ఒడిగట్టిన ఓ పాకి స్తాని తీవ్ర వాదిని ఇన్ని రోజులు పెంచి పోషించడమే మన దౌర్భాగ్యం. 
                        అభం శుభం తెలియని చిన్నారుల్ని... మన దేశంపై ప్రేమతో వచ్చిన విదేశీయుల్ని... మన ఆర్ధిక రాజధాన్ని నామ రూపాలు లేకుండా చేసిన ఓ కసాయికి పడాల్సిన శిక్ష ఎలా వుండాలి. సాక్ష్యాలు కళ్ళముందే వున్నాయి. యావత్ భారతావని దారుణ సిక్షనే కోరుకుంటుంది. ఇప్పటికే చాలా కోల్పోయాం. చాలు. ఇంకా పోగొట్టుకునేందుకు సిద్ధంగా లేం.
                       నేరానికి తగిన శిక్ష. మన దేశం పై ఎవడైనా వేలేతి చూపితే ఫలితం  ఎంత దారుణంగా ఉంటుందో చూపించే శిక్ష. అసాధారణ శిక్షలలో మన తీర్పు ఇలానే వుండాలి.  తను చేసిన తప్పుకు ఇప్పటికీ పచ్చాతాపం పడని కసబ్ ను వెంటనే ఉరి తియ్యాలి. అయితే మన చట్టాల ప్రకారం... అతను సుప్రీం కోర్ట్ కు వెళ్ళే అవకాసం వుంది. అక్కడ కూడా ఇదే శిక్షను వీలైనంత త్వరగా విధించాలి.ఇది ఓ భారతీయుడిగా నా ఆవేదన..... కొన్ని కోట్ల మంది ఆకాంక్ష...

Friday, February 18, 2011

కాంగ్రెస్ కుటిల రాజకీయం..

      ఘన చరిత్ర మాది. ఎవరైనా మమ్మల్ని చూసే నేర్చుకోవాలి. మా పార్టీ త్యాగాల మయం. అంటూ ఊదర గొట్టే కాంగ్రెస్ పార్టి చేస్తున్నపనేంటి. అటు కేంద్రం లో ఇటు రాష్ట్రం లో అధికారంలో వుండి, ప్రజలకు, ప్రజాస్వామ్యానికి కట్టుబడి.. సంక్షేమాన్ని కాపాడాల్సిన పార్టి వీధి రౌడీల అడ్డాగా మారిపోయిందా? లేక అధికార ఏవతో, నిస్సిగ్గుగా ప్రవర్తిస్తుందో అర్థం కావడం లేదు. తెలంగాణాపై ఓ స్పష్టమైన వైకరిని చెప్పకుండా... రాష్ట్రాన్ని రావణ కాస్ట్టంగా మార్చేస్తోంది. తెలంగాణా తెచ్చేదీ, ఇచ్చేది మేమే అని ప్రగల్బాలు పలికి... అనవసర ఆర్బాటాలకు... అనవసర గంధర గోలానికి కారణ మైన తెలంగాణా కాంగ్రెస్ నేతల వైఖరి కుటిల రాజకీయాలకు అద్దం పడుతుంది. అధిష్టానం పిలుపుతో వెళ్ళిన తెలంగాణా కాంగ్రెస్ నేతలు... అక్కడ ఢిల్లీ నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తూ... బయట మీడియా ముందు నానా హంగామా చేస్తున్నారు. తెలంగాణా బిల్లు పెట్టడమే లక్ష్యం అంటూ... తెలంగాణా మేమే సాధిస్తాం అంటూ... ప్రజల్ని మభ్య పెట్టె జిమ్మిక్కులు వేస్తున్నారు. అసలు అసెంబ్లీ జరుగుతుంటే వీల్లెందుకు అక్కడకు వెళ్ళాలి. ఇన్నాళ్ళు లేని... గుర్తుకు రాని వ్యవహారం ఇప్పుడే వచ్చిందా. 
                                       రెండు నాల్కల ధోరణితో సగటు మనిషిని దారుణంగా వాడుకుంటూ, ఆడుకుంటున్న కాంగ్రస్ తన వైఖరి మార్చుకోవాలి. ఇప్పటికే  రాజకీయాల పై వున్నా కాస్తంత గౌరవం పొయింది. ఇక మిగిలింది నాయకులకు దేహ సుద్దే. అది వాల్లచేతుల్లోనే వుంది. కాంగ్రెస్ వైఖరి  కేవలం ఒక్క ప్రాంతం లోనే కాదు యావత్ దేశం లోనే అత్యంత దయనీయంగా వుంది. సాక్షాతూ ప్రధాన మంత్రే ప్రబుత్వంలో అవకతవకలు... అవినీతి జరిగిందని ఒప్పుకున్నారు. ఎలాంటి సమస్యపై స్పందించాల్సి వచ్చిన ఎదురు దాడినే నమ్ముకోవడం కాంగ్రెస్ పార్టీ కి, ఆ నాయకులకు అలవాటుగా మారిపోయింది. 


                                    ఎవరు సెలెక్ట్ చేసారో గాని హస్తం గుర్తుని.... వాడికి హాట్సాఫ్ చెప్పాలి... ఎందుకంటే సంక్షేమం కోసం ఇవ్వాల్సిన అభయ హస్తం కాస్త... సామాన్యుడి నెత్తిపై... బస్మాసుర హస్తాంగా వాడుకుంటున్నారు. ఏది చెయ్యాలన్న...ఎలా చెయ్యాలన్న కాంగ్రెస్ కే సాధ్యం. అధికారం నిలబెట్టు కోవడానికి విలువలకు వలువలు వూదదీయడంలో కొంగ్రెస్ ఈ మధ్య కాలంలో రికార్డు సృష్టిస్తోంది. క్రికెట్లో సచిన్ సెంచరీల రికార్డ్ అయినా బ్రేక్ చేసే వీలుందేమో గాని  కుటిల రాజకీయ జిమ్మిక్కుల్లో కాంగ్రెస్ రికార్డు బ్రేక్ చెయ్యడం ఎవరి తరం కాదని ఆ పార్టీ నిరూపిస్తోంది. 

Thursday, February 17, 2011

ఎక్కడుంది ప్రజాస్వామ్యం....


        ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా ఓ ప్రజా ప్రతినిధి పై మరో ప్రజా ప్రతినిధి జరిపిన దాడి. అది కూడా ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఓ గొప్ప ఉద్యమాన్ని నడిపించే నాయకుడి వారసుడి ప్రోద్బలంతో జరిగిన దాడి. ఏమౌతుంది...ఎటువైపు వెళ్తున్నాం. ప్రతి సమస్యకు హింసే మార్గం అనుకుంటే భారతావనికి స్వేచ వచ్చేదా... అసలైన సమస్యను... సమస్యకు కారణం అయినవాళ్ళను వదిలి పెట్టి. తన మనో భావాన్ని చెప్పిన ఓ ప్రజాప్రతినిది పై దాడి చెయ్యడం అమానుషం. వేదిక ఏదైనా సరే మనసులో మాటల్ని... చెప్పే కనీస స్వేచ లేదా...మనం ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామా...లేక నియత్రుత్వ పాలనలో ఉన్నామా?  అలా అయితే ఓ ప్రాంత ప్రజల మనోభావాలను దారుణంగా దెబ్బతీసేలా మాట్లాడుతున్న ఎంతో మంది నాయకుల్ని ఎం చెయ్యాలి... అన్ని ప్రాంత ప్రజలు... ప్రజా ప్రతినిధులు హింసే సరైన మార్గం అనుకుంటే... అలా జరిగితే... ఊహించడానికే భయం వేస్తోంది... 

                             ఈ దాడిని చాలా మంది చాలా రకాలుగా అభివర్నిచొచు ఆధీ వారి వారి ఆలోచన విచక్షణ పై ఆధారపడి వుంటుంది.  కొంత మంది ఎం 
కొట్టావ్ రా బయ్య...ఇంకొంచెం గట్టిగ కొట్టుండాల్సింది...వీ నా కొడుక్కి... అనే ప్రబుదుల్ని ఏమనాలి. ఇలా ఆలోచించే వాళ్ళు మధ్య మనం వున్నామంటే సిగ్గుపడాల....లేక ఆనందించాల... కేవలం ఎదుటివారిపై దాడులు చేస్తేనో... హింసాయుత మార్గంలో వెళ్తేనే ప్రస్తుత సమస్య తీరిపోతుంది అనే భావన చాల ఇబ్బందుల్ని తేచిపెడుతుంది. రాజ్యాంగానికి కట్టుబడాల్సిన ప్రజా ప్రతినిధులే నిస్సుగ్గుగా బజారున పడి పశువుల్లా ప్రవర్తిస్తుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి. వాళ్లకు ఎలాంటి సంకేతాలు ఇచ్చినట్లు. 

                                    ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో వున్న పరిస్థితిపై స్పందించాలి. చౌకబారు రాజకీయాలకు పాల్పడుతున్న నేతలు విచక్షణతో వ్యవహరించాలి. ఇలాంటి పరిస్థితులు రాకుండా జాగ్రత వహించాలి. 


Tuesday, February 15, 2011

వీడు మోనార్కే....!

    నేను మోనార్క్ ని అంటూ, తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు ప్రకాష్ రాజ్.విలక్షణ నటనతో అందరి దృష్టిని ఆకర్షించడంలో స్పెషలిస్ట్ ప్రకాష్ రాజ్. సినిమా రేంజ్ ని పెంచే నటుల్లో ప్రకాష్ రాజ్ ఒకరు. కొన్ని సందర్బాలలో తన కాల్ షీట్లు కోసం షూటింగ్ లను కూడా వాయిదా వేసుకున్న సందర్భాలు వున్నాయి. అదీ ప్రకాష్ రాజ్ స్టామిన. ఓ ప్రేక్షకుడిగా కాకుండా...రిపోర్టర్ గా తన గురించి తెలుసుకున్నప్పుడు...ప్రకాష్ రాజ్ వ్యక్తిత్వం తెలిసింది. కాదు... ఆయనే చెప్పాడు.... అది కూడా తనదైన స్టైల్లో.... ఎలాంటి పబ్లిసిటీ లేకుండా సక్సెస్ ను తన చుట్టూ తిప్పుకుంటా అంటున్నాడు. లో ప్రొఫైల్ తన సక్సెస్ మంత్ర అని తేల్చి చెప్పాడు. పనిని ఇష్ట్ట పడడమే తనకి తెలుసంట్టున్నాడు.
     మీడియాలో  అనవసరంగా కనిపించడం.. నా సినిమా చూడండి అని చెప్పడం... నా ఇంటర్వ్యూ తీసుకోండి అని చెప్పడం.... ఎవరికీ తలోంచడం నా లైఫ్ లో చెయ్యను అని తెగేసి చెపుతున్నాడు. అంతే కాదు సక్సెస్ గురించి....సక్సెస్ కోసమే మాట్లాడే ఇండస్ట్రీ. అందుకే సక్సెస్ వస్తే అందరు తన వెంటే వస్తారట... అదే తాను నమ్మిన ఫిలాసఫీ అని చెప్పాడు. ఎవరేమనుకుంటే నా కేంటి... నేనిలానే ఉంటా... నా తీరింతే.... నా రూటే సెపరేటు... అని బాహాటంగానే చెప్పాడు.  చీటికి మాటికి ఎవడి పుట్టిన రోజుకో నేనెందుకు మీడియా ముందు శుభాకాంక్షలు చెప్పాలి. పండక్కి, పబ్బనికి అందరిలా నేను విషెస్ చెప్పను. ఏం చెప్పక పోతే ఆఫర్లు రావా.... పోతే పోనీ... కానీ నేనింతే...అడిగిన ప్రతి ఒక్కడికి జవాబు చెప్పుకుంటూ పోతే...నా రేంజ్ ఏం గాను...నా రేంజ్కి తగ్గే పనుల్ని నేను చెయ్యను. అని తన మనసులో మాటలు ఎన్నింటినో చక చక చెప్పాడు. నేనిలానే వుంటా... కావాలనే వల్లే వస్తారు... లేక పోతే మానేయ్యండి... నేను మోనార్క్ ని. అనే రేంజ్ లో లెక్చర్ ఇచ్చాడు. ఆన్ స్క్రీన్ పై చాలా మంది చాలా డైలాగులు చెబుతారు... కానీ నేను నిజ జీవితంలో కూడా అలానే చెప్పగలనని నిరూపిస్తున్నాడు ప్రకాష్ రాజ్. ఏదేమైనా కొంత వరకు తను కూడా కరక్టే అనిపించింది. 



Thursday, January 20, 2011

వాయిదా బతుకులు....!



వాయిదా ఈ పదం పలికినా, విన్నా, అందరికీ ఎంత ఆనందమో మాటల్లో చెప్పలేం.పిల్లాడికి హొం వర్క్ తర్వాత చేద్దువులే అంటే ఆనందం. విద్యార్థులకు పరీక్షలు వాయిదా పడితే ఆనందం. లాయర్లకు లాభాసాటి కేసుల్ని వాయిదాల మీద వాయిదా వేయడం అంటే ఆనందం. ఇలా చెప్పుకుంటే వాయిదాకి చాలా పెద్ద లిస్తే వస్తుంది. ఎందుకంటే వాయిదా వేయడంలోనే ఆనందాన్ని వెతుక్కునే ట్రెండ్ ఊపందుకుంది. కాదు, ఆ ట్రెండ్ను సృస్ట్టిన్చుకున్నాం. అసలు వాయిదా వేయకుండా చాలా మందికి పొద్ద్దు పొడవడమే లేదు. రొజూ ఏదో ఓ టైములో అద్దం ముందు చేత్తో  ఫ్యామిలీ ప్యాక్ ను మించిపోతున్న పొట్టను నిమురుతూ .... రేపటి నుంచి జాకింగ్, వాకింగ్, మొదలు పెట్టాలి లేదా జిమ్కి  వెళ్ళాలి అనుకుంటాం. కాని, వెధవ   జీవితం తెల్లారే లేవడం అంటే యమ సిరాకు. వెంటనే మనకు మనమే నచ్చ చెప్పెసుకున్తున్నాం . రేపట్నుంచి వెళ్దాం లే అని. అలా వాయిదాతోనే రోజు మొదలు. ఇక ఆ వాయిదా  వేయిస్తుంది మన చేత చిందులే చిందులు. ఒక్క ఒక్క ముక్కలో చెప్పాలంటే తీన్ మార్ ఆడేస్తోంది.  ఒకప్పుడు వందల్లో జీతాలు..... ప్రశాంత జీవితాలు. మరి ఇప్పుడో వేళల్లో జీతాలు కనుమరుగౌతోన్న ఆనందాలు. కారనాలు అంటే ... అవేనండి వాయిదా బతుకులు....! అర్థం కావడం లేదా... వాయిదా పద్ధతుల్లో గుండు సూది నుంచి, విలాసవంతమైన విల్లాల వరకు అన్నింటిని ఎవైన గాని యిట్టె అమర్చుకుటున్నాం. పేరుకే వేళల్లో జీతాలు. ఒకటో తారీకున అలా జీతం డబ్బులు పడటమే లేటు మనకు తెలీకుండానే మన వాయిదా బిల్లుల లొల్లి మొదలు. మనం వేసుకున్నట్లు పాపం ఆ బిల్లులు మాత్రం వాయిదా వేసుకోవు కదా.... వాటి పని అవి టంచనుగా చేస్తాయి. రిజల్ట్ చాలా వయలెంట్గా  వుంటుంది. అకౌంట్లో డబ్బులు అటు నుంచి అటే గోల్మాల్. అక్కడితో ఆరంభం అవుతుంది అసలు కథ. చీటికీ మాటికీ వస్తుంది చిరాకు... ఆపై వుంటుంది అసలు పరాకు. మనిషేమో పనిలో మనసేమో వేరే లోకంలో. అయినవాల్లపై చిందులు... ఆత్మీయులపై అరుపులు... మొత్తం జీవితంలో లేకుండా పోతోంది ఆనందపు ఆనవాళ్ళు. 
             ఉద్యోగులకు ఆఫీసుకు వెళ్ళగానే బాస్ చెబుతానన్న కొత్త వర్క్ లిఫ్ట్ లోనో, లేదా బాస్ చాంబర్ చూడగానో గుర్తొస్తుంది. పాపం ముందు రోజు రాత్రి జోష్ మూడ్ లో మరచిపోతాం. పోనీ గుర్తున్నా ఆఫీసులోను, ఇంట్లోను పనేనా మనిశన్నాక  కాస్త కళా పోషణ ఉండొద్దా అని  మనకు మనమే చెప్పే సుకుంటాం. వాయిదా కే  ఓటేస్తాం. 
            వాయిదా బతుకు సామన్యుడికేకాదు సాక్షాత్తూ ప్రభుత్వాలకూ తప్పడం లేదు. వాయిదా వేయకుంటే బతుకుబండిని లాగలేం అని కాస్త గట్టిగానే  ఫీల్ అవుతున్నాయి.  ప్రజలకు ఇస్తామని కాస్త గట్టిగానే చెప్పిన హామీలని నేరవేర్చడంలోనూ, వాళ్లకు వాళ్ళుగా ప్రకటించిన పేకేజిల  అమలుల్లోనూ వాయిదా మార్గాన్నే ఎంచుకుంటున్నారు. వాయిదాల పున్నెమా అని సామాన్య ప్రజలకే కాదు, రాష్ట్రాలకు, కేంద్ర ప్రభుత్వాలకు తప్పడం లేదు తిప్పలు. వాయిదానా మజాకా....!